దూసుకొస్తున్న దిత్వా.. అధికారులకు హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-11-28 07:54:53  IST  )

నైరుతి బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంలో ఏర్పడిన దిత్వా తుపాన్ తీరం వైపుకు దూసుకొస్తోంది.

దూసుకొస్తున్న దిత్వా.. అధికారులకు హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: నైరుతి బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంలో ఏర్పడిన దిత్వా తుపాన్ తీరం వైపుకు దూసుకొస్తోంది. శుక్రవారం ఉదయం 7.30 గంటల సమయానికి ఇది శ్రీలంకలోని ట్రింకోమలీకి 80 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 480 కిలోమీటర్లు, చెన్నైకి 580 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది ఆదివారానికి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా తీరాలకు చేరువగా వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో శని, ఆదివారాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని, మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమయింది. హోంమంత్రి అనిత తుపాను సహాయక చర్యలపై సమీక్ష నిర్వహించారు.

తుపాను ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురవనున్న క్రమంలో క్షేత్రస్థాయిలో అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. NDRF, SDRF బృందాలను సిద్ధంగా ఉంచాలని, మత్స్యకారులు, రైతులు, ముంపు ప్రజలను అలర్ట్ చేయాలని సూచించారు. వర్షాల నేపథ్యంలో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అవసరమైన ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రమాదకరంగా ఉన్న హోర్డింగ్స్ ను వెంటనే తొలగించేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. జిల్లా, మండల స్థాయిల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని హోంమంత్రి అనిత దిశానిర్దేశం చేశారు.

Next Story