AP News:రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు.. తాగునీటి అవసరాలపై హోం మంత్రి అనిత ఆరా

by Jakkula.Mamatha |   (  Updated:2025-04-22 08:44:11  IST  )

రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి

AP News:రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు.. తాగునీటి అవసరాలపై హోం మంత్రి అనిత ఆరా
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. గతంలో కంటే ఈ ఏడాది రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఓవైపు ఎండలు, మరోవైపు తీవ్ర వడగాల్పులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. అయితే వేసవి కాలం వచ్చిందంటే చాలు పలు ప్రాంతాల్లో నీటి ఎద్దడి నెలకొంటుంది. ఈ క్రమంలో తాగునీటి అవసరాలపై రాష్ట్ర(Andhra Pradesh) హోంమంత్రి వంగలపూడి అనిత(Home Minister Anita) ఆరా తీశారు. వేసవి కారణంగా గ్రామాల్లో తాగునీటి ఎద్దడి సమస్య తలెత్తుతుందని కావున ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తాగునీటి సమస్య లేకుండా చూడాలని అధికారులకు సూచించారు.

ఈ తరుణంలో CDMA డైరెక్టర్ సంపత్ స్పందిస్తూ.. పట్టణ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా అప్రమత్తంగా ఉన్నామని తెలిపారు. 100 రోజుల యాక్షన్ ప్లాన్‌తో ముందుకెళ్తున్నట్లు ఆయన వెల్లడించారు. అనంతరం రాబోయే రోజుల్లో రాష్ట్రంలో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉన్నందున.. వడగాల్పులకు గల అవకాశాలపై హోంమంత్రి అనిత అధికారులను అడిగారు. ఈ నేపథ్యంలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్(Summer Storage tank)ల్లో నీరు నిల్వ చేసినట్లు RWS అధికారులు తెలిపారు. 92 మండలాలను ముందస్తుగా గుర్తించి ఆ ప్రాంత ప్రజలకు నీటి కష్టాలు లేకుండా ఏర్పాట్లు చేశామని అధికారులు వెల్లడించారు.

పాఠశాలల్లో నీటితో పాటు, NGO, విరాళాల ద్వారా మజ్జిగ పంపిణీ చేస్తున్నామని.. వడదెబ్బ బారిన పడిన వారి చికిత్స కోసం 5,145 పడకలను, 768 అంబులెన్సులు సిద్ధం చేసినట్లు వైద్యాశాఖ అధికారి తెలిపారు. ఈ క్రమంలో ప్రజలకు ఎండలు, వడగాల్పుల పై అవగాహన పెంచాలని సూచించారు. వడగాల్పులతో మృతి చెందిన వారికి రూ.4 లక్షల పరిహారం అందజేయనున్నట్లు పేర్కొన్నారు.

Next Story