మిథున్‌రెడ్డికి హైకోర్టు షాక్.. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత

by Yella Dhawani Reddy |

మద్యం కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఏపీ హైకోర్టు షాకిచ్చింది.

మిథున్‌రెడ్డికి హైకోర్టు షాక్.. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
X

దిశ, వెబ్ డెస్క్: మద్యం కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి (MP Midhun reddy) ఏపీ హైకోర్టు (AP High Court) షాకిచ్చింది. ముందస్తు బెయిల్ కోసం ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో మిథున్‌ రెడ్డి ఏ4 నిందితుడిగా ఉన్నారు. ఏపీలో మద్యం సరఫరాలో పారదర్శకతను తగ్గించేందుకు ఆన్లైన్‌ విధానాన్ని మాన్యువల్‌ మోడల్‌గా మార్చడంలో ఆయన కీలకపాత్ర పోషించినట్టు, దాంతో లావాదేవీలను తన నియంత్రణలోకి తీసుకున్నట్టు సిట్ తరఫున న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదించారు. ముడుపులు ఇచ్చిన కంపెనీలకే మద్యం సరఫరా అనుమతులు మంజూరయ్యాయని, దీనివల్ల ప్రభుత్వానికి రూ.3,500 కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపారు.

మిథున్‌ రెడ్డి ఈ స్కాంలో వ్యూహరచన చేసి అమలు చేసిన మాస్టర్ మైండ్‌గా ఉన్నారంటూ సాక్షుల వాంగ్మూలాలను కూడా కోర్టుకు సమర్పించారు. ఆయన ఎంపీ పదవిని దుర్వినియోగం చేశారని, విచారణకు సహకరించడం లేదని సిట్ వాదించింది. మిథున్‌ రెడ్డిపై ఇప్పటికే 8 ఫిర్యాదులు ఉన్నాయని పేర్కొంది. మరోవైపు, మిథున్‌ తరఫున న్యాయవాది టి.నిరంజన్‌ రెడ్డి వాదిస్తూ, మద్యం విధానానికి మిథున్‌కు సంబంధం లేదని, షరతులతో కూడిన ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. వాదనలు ముగిసిన అనంతరం హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసి, మంగళవారం ఆయన పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ తీర్పుతో మిథున్‌ రెడ్డికి విచారణలో గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టైంది.

Next Story