రైతులను ఆదుకోండి.. సీఎస్ డా.కేఎస్ జవహర్ రెడ్డికి చంద్రబాబు నాయుడు లేఖ

by Disha Web Desk 7 |
రైతులను ఆదుకోండి.. సీఎస్ డా.కేఎస్ జవహర్ రెడ్డికి చంద్రబాబు నాయుడు లేఖ
X

దిశ, డైనమిక్ బ్యూరో : అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. మార్చిలో కురిసిన వర్షాలకు రెండు లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని చంద్రబాబు లేఖలో వివరించారు. గత రెండు రోజులుగా కురిసిన వర్షాలతో చేతికొచ్చే పంట నేలపాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా, గుంటూరు, గోదావరి డెల్టా ప్రాంతాల్లో భారీగా వరిపంట దెబ్బతిందని.. కళ్లాల్లో ఆరబెట్టిన వేలాది టన్నుల ధాన్యం తడిచిపోయిందని లేఖలో తెలిపారు. మొక్కజొన్న రైతులు కూడా తీవ్రస్థాయిలో నష్టపోయారని పేర్కొన్నారు. ప్రకాశం, పల్నాడు, గుంటూరు జిల్లాల్లో భారీగా మిరప పంట దెబ్బతిందని తెలిపారు.

కోతలు పూర్తి కాక.. ఈదురు గాలుల ధాటికి మిరప రాలిపోయింది అని చెప్పుకొచ్చారు. అరటి, మామిడి రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారని వెల్లడించారు. పిడుగులు పడి ఏడుగురు రైతులు దుర్మరణం బాధాకరమన్నారు. మృతి చెందిన రైతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. దెబ్బతిన్న, రంగుమారిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలి అని కోరారు. అలాగే రబీ ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి అని సీఎస్‌కు సూచించారు. వరి, మొక్కజొన్నకు ఎకరాకు రూ.20వేలు, మిర్చి, అరటి, మామిడికి రూ.50 వేలు పరిహారం అందించాలి అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీఎస్ డా కేఎస్ జవహర్ రెడ్డిని లేఖలో కోరారు.

Also Read..

ఒక్క దెబ్బతో KCR, బాబును ఇరుకున పెట్టిన జేసీ.. ఉమ్మడి రాష్ట్రాల్లో కాక రేపుతోన్న మాజీమంత్రి డిమాండ్!



Next Story

Most Viewed