ఏపీలో సర్కార్ సినిమాను తలపించిన సీన్...గెలిచిన మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ

by Disha Web Desk 21 |
ఏపీలో సర్కార్ సినిమాను తలపించిన సీన్...గెలిచిన మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ
X

దిశ, డైనమిక్ బ్యూరో : ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఆయనో సీఈవో. అంతటి వ్యక్తి స్వదేశంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వస్తాడు. అయితే ఆ సీఈవోకు ఊహించని షాక్ తగులుతుంది. తన ఓటు వేయడానికి పోలింగ్ బూత్‌లోకి ఆ సీఈవో రాగా అప్పటికే తన ఓటు మరోకరు వేసేసి ఉంటారు. దీంతో తన ఓటు కోసం ఆ సీఈవో హీరోగా మారిపోరాటం చేసి రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తాడు. ఇదేంటి సర్కార్ సినిమా చెప్తున్నాడు అనుకుంటున్నారా? సర్కార్ సినిమాను తలపించేలా సీన్ ఏపీలో జరిగింది. సినిమాలో ఉన్న ఓటు మరోకరు వేస్తే దాని కోసం పోరాటం జరిగితే ఇక్కడ ఉన్న ఓటును అధికారులు తొలగించడంపై పోరాటం చేసి తిరిగి ఓటు హక్కు సంపాదించారు. అక్కడ హీరో విజయ్ అయితే ఇక్కడ హీరో మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్. వివరాల్లోకి వెళ్తే నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ ఓటును స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఓటర్ల జాబితా నుంచి అధికారులు తొలగించిన సంగతి తెలిసిందే. అయితే తన స్వగ్రామంలో ఓటు హక్కు తొలగించడంపై మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ న్యాయస్థానాలను ఆశ్రయించారు. తన స్వగ్రామంలోనే తనకు ఓటు హక్కు ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. దుగ్గిరాలలోనే తనకు ఇల్లు, ఆస్తులు ఉన్నాయని, తన తల్లి లక్ష్మి కూడా అదే గ్రామంలో ఉంటున్నారని కోర్టుకు తెలియజేశారు. ఈ కేసుపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఆయనకు అర్హతలుంటే అదే గ్రామంలో ఓటు హక్కు ఇవ్వాలని ఆదేశించింది. దీంతో నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ పేరు జాబితాలో చేరింది.ఎట్టకేలకు దుగ్గిరాలలో ఓటు హక్కును నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సాధించడంపై పలువురు ప్రశంసిస్తున్నారు.


Next Story