అవి కాకి లెక్కలు.. అడ్డంగా దొరికిపోయారు: చంద్రబాబుపై సజ్జల సంచలన ఆరోపణలు

by Vemula.Srinu Prasad |

అమరావతి సెల్ఫ్‌ ఫైనాన్స్‌ ప్రాజెక్టు అని, ప్రభుత్వం చేతిలో 5 వేల ఎకరాల ల్యాండ్‌ బ్యాంక్‌ ఉందని, ప్రస్తుత రేట్ల ప్రకారం దాని విలువ రూ.50 వేల కోట్లు పైమాటేనని, అమరావతిపై ద్వేషంతోనే వైయస్పార్‌సీపీ విమర్శలు చేస్తోందంటూ చంద్రబాబు మరోసారి పచ్చి అబద్ధాలు చెప్పారని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు..

అవి కాకి లెక్కలు.. అడ్డంగా దొరికిపోయారు: చంద్రబాబుపై సజ్జల సంచలన ఆరోపణలు
X

దిశ, వెబ్ డెస్క్: అమరావతి సెల్ఫ్‌ ఫైనాన్స్‌ ప్రాజెక్టు అని, ప్రభుత్వం చేతిలో 5 వేల ఎకరాల ల్యాండ్‌ బ్యాంక్‌ ఉందని, ప్రస్తుత రేట్ల ప్రకారం దాని విలువ రూ.50 వేల కోట్లు పైమాటేనని, అమరావతిపై ద్వేషంతోనే వైయస్పార్‌సీపీ విమర్శలు చేస్తోందంటూ చంద్రబాబు మరోసారి పచ్చి అబద్ధాలు చెప్పారని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కాకి లెక్కలతో ప్రజలను నమ్మించబోయి చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారని ఆయన విమర్శించారు. సీఎం చెబుతున్న లెక్కలు కరెక్టే అయితే తన ప్రశ్నలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.

5 వేల ఎకరాల భూమి మాత్రమే..

‘‘మీ మాటల ప్రకారమే ఆ ప్రాజెక్టులో ఆదాయం తీసుకొచ్చే ఏకైక వనరు కేవలం 5 వేల ఎకరాల భూమి మాత్రమే. ఇప్పుడు అక్కడ ఎకరం భూమి విలువ రూ.10 కోట్లు అని మీరంటున్నారు. కానీ, అక్కడ మీరు మీ ఇంటి కోసం కొన్న 25 వేల గజాల (5 ఎకరాలు) స్థలం ధర గజం రూ.7,500. మీ దస్తావేజుల ప్రకారమే లెక్క కడితే ఎకరం భూమి విలువ రూ.3.63 కోట్లు. నిజానికి రాజధానిలోని ఆ ప్రాంతంలో ప్రభుత్వ రికార్డుల (ఎస్‌ఆర్‌ఓ) ప్రకారం గజం భూమి ధర రూ.6 వేలు మాత్రమే. ఆ లెక్క ప్రకారం అక్కడ ఎకరం భూమి విలువ రూ.2.91 కోట్లు. అయినా కూడా మీ లెక్క ప్రకారమే, మీరు కొన్నట్లు గజం రూ.7500 చొప్పున లెక్క వేసుకున్నా, ఆ ధర ప్రకారం మీరు 5 వేల ఎకరాలు అమ్మినా, ఎవరైనా కొంటానన్నా వచ్చేది దాదాపు రూ.18 వేల కోట్లు మాత్రమే. అంతకు మించి ఒక్క పైసా రాదు. మరోవైపు మీరు ఇప్పటికే ఆ మేరకు ఖర్చు పెట్టేశారు. మేము ఇంకా దానికి వడ్డీ లెక్కేయడం లేదు. అమరావతిలో మీరు ఇప్పటికే ఇచ్చిన కాంట్రాక్ట్‌ల విలువ రూ.50 వేలకు కోట్లకు పైగానే. ఇంకా అక్కడ కనీస మౌలిక సదుపాయాల కోసమే మీరు చెబుతున్న ఖర్చు ఎకరాకు రూ.2 కోట్ల చొప్పున.. ఇప్పుడు సేకరించే దాన్ని కూడా కలుపుకుంటే మొత్తం ఖర్చు రూ.2 లక్షల కోట్లు. కాగా, ఇప్పటి వరకు మీరు ఖర్చు పెట్టింది అప్పు. ఇంకా తెచ్చేది కూడా అప్పు. దానికి వడ్డీ లెక్క వేస్తే రూ.2 లక్షల కోట్లకు ఏటా రూ.15 వేల కోట్ల నుంచి రూ.20 వేల కోట్లు అవుతుంది.’’ అని సజ్జల తెలిపారు.

అప్పు చేయాల్సిందే కదా?

‘‘పోనీ మీరు అనుకున్నట్లు అభివృద్ధి చెందాక ఎకరం విలువ రూ.20 కోట్లు అవుతుందనుకుంటే, ఆ అభివృద్ధి చెందడానికి 20 ఏళ్లు పడుతుందని మీరు, 15 ఏళ్లు పడుతుందని మీ కొడుకు అంటున్నారు. మరి అప్పటికి వడ్డీనే రూ.3 లక్షల కోట్లు అవుతుందా?. లేక రూ.4 లక్షల కోట్లు అవుతుందా?. నిజం చెప్పాలంటే ఆ వడ్డీ కట్టడానికి కూడా మీరు అప్పు చేయాల్సిందే కదా. మరి అలాంటప్పుడు ఆ అప్పు మీద వడ్డీ మాటేమిటి?. మీకు సంపద సృష్టి కోసం అవి పనికి రావొచ్చు. కానీ, మన రాష్ట్రం మీద పడే భారం మాటేమిటి?. ఇప్పుడు ఈ విషయం మీకుచెప్పి కూడా లాభం లేదు. ఎందుకంటే ఈ లెక్కలు మీకు కూడా తెలుసు. ఇప్పుడు ఆలోచించాల్సింది రాష్ట్ర ప్రజలు. అమరావతి పేరుతో రాష్ట్రాన్ని శాశ్వతంగా అప్పుల ఊబిలో ముంచే, చంద్రబాబుగారి మార్క్‌ ‘ఎండ మావి’జన్‌ కావాలా?. అందులో పదో వంతు ఖర్చుతో–అదీ దశలవారీగా–రాష్ట్ర రాజధానిని అతి స్వల్ప కాలంలోనే అగ్రశ్రేణి నగరాల సరసన నిలిపే జగన్‌గారి మార్క్‌ గ్రోత్‌ ఇంజన్‌ ‘మావిగన్‌’ కావాలా?.’’ అని సజ్జల ప్రశ్నించారు.

Next Story