'చదువులేని వాడు వింత పశువు' అంటూ ఎమ్మెల్యే కేతిరెడ్డిపై అచ్చెన్న సెటైర్లు

by Disha Web Desk 16 |
చదువులేని వాడు వింత పశువు అంటూ ఎమ్మెల్యే కేతిరెడ్డిపై అచ్చెన్న సెటైర్లు
X

దిశ, డైనమిక్ బ్యూరో: వైసీపీ తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఆయన కుమారుడు హర్షవర్ధన్ రెడ్డి, డీఎస్పీ చైతన్యలు కలిసి ఒక దళిత మహిళపై కక్షకట్టి అక్రమ కేసులు బనాయించడం దుర్మార్గం అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. చదువురాని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని చదువుకోమని చెబితే ఏ మంత నామోషా? కేతిరెడ్డి మనసు మార్చుకుని చదువుకోడానికి ముందుకొస్తే ఎల్.కే.జీ నుంచి చదివించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అనంతపురం జిల్లాలోని ఏ స్కూల్లో చేరిన ఫీజు తామే కడుతామన్నారు. చదువుకోమని సలహా ఇస్తే దళిత మహిళ కమలమ్మపై అట్రాసిటీ కేసు పెడుతారా? అని మండిపడ్డారు.

పెద్దారెడ్డి, ఆయన కుమారుడు హర్షవర్ధన్ రెడ్డి అరాచకాలు తారాస్థాయికి చేరాయని, అందుకే దళిత మహిళ అని కూడా చూడకుండా అక్రమ కేసు పెట్టి రిమాండ్‌కు తరలించాలని చూశారన్నారు. చదువులేని వాడు వింత పశువు అనడానికి పెద్దారెడ్డే నిదర్శనం అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నాయకులు ఎలా ఆడమంటే అలా ఆడుతూ.. డీఎస్పీ చైతన్య చట్టాన్ని తుంగలో తొక్కుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. చైతన్య గతంలోనూ చాలా మంది టీడీపీ కార్యకర్తలపై, నాయకులపై అక్రమ కేసులు బనాయించారని గుర్తు చేశారు. ఇప్పటి వరకు డీఎస్పీ చైతన్య వైసీపీ కార్యకర్తలా సామాన్యులను అరెస్టు చేసి చేసిన లాకప్ హింసల చిట్టా తమ వద్ద ఉందని, వీటన్నిటికీ రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. చట్టాలను తుంగలో తొక్కి వైసీపీ నాయకులకు ఊడిగం చేస్తున్న డీఎస్పీ చైతన్యకు తమ ప్రభుత్వం వచ్చాకా చట్టాలను ఎలా అమలు చేయాలో నేర్పుతామని చెప్పుకొచ్చారు. అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదని కేతిరెడ్డి పెద్దారెడ్డి గుర్తుంచుకోవాలని సూచించారు. ఇకనైనా కేతిరెడ్డి సామాన్యులపై తన ప్రతాపం చూపడం మాని బుద్దిగా నడుచుకోకపోతే భవిష్యత్తులో తగిన శాస్తి చేస్తామంటూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హెచ్చరించారు.


Next Story