BREAKING: నారా లోకేశ్‌పై డీజీపీకి పోసాని ఫిర్యాదు.. ఇక ఆయనే చూసుకుంటారని హెచ్చరిక

by Disha Web Desk 16 |
BREAKING: నారా లోకేశ్‌పై డీజీపీకి పోసాని ఫిర్యాదు.. ఇక ఆయనే చూసుకుంటారని హెచ్చరిక
X

దిశ, వెబ్ సైట్: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ తనను చంపించేందుకు కుట్ర చేస్తున్నారని వైసీపీ నేత, సినీ నటుడు పోసాని కృష్ణ మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు డీజీపీ రాజేంద్రనాథ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. తనను రక్షించాలని డీజీపీని కోరారు. లోకేశ్ వల్ల తనకు ప్రాణ హాని ఉందని కంప్లైంట్ చేశారు. తనను లోకేశ్ చంపించేందుకు కుట్ర పన్నుతున్నారని పోసాని ఆరోపించారు. టీడీపీలో చేరాలని అడిగితే తాను నిరాకరించానని... అందుకే లోకేశ్ ఇగో హర్ట్ అయిందని చెప్పారు. ఇంకా చాలా విషయాలు డీజీపీ దృష్టికి తీసుకెళ్లానని పోసాని పేర్కొన్నారు. ఎవరైనా ఆధారాలు చూపించి హత్య చేస్తారా? అని ప్రశ్నించారు. తనకు భద్రత కల్పిస్తామని డీజీపీ కూడా భరోసా ఇచ్చినట్లు పోసాని స్పష్టం చేశారు.

కాగా నటుడు పోసాని కృష్ణమురళిపై నారా లోకేశ్‌ పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఇటీవల మంగళగిరిలో కోర్టులో లోకేశ్ వాంగ్మూలం ఇచ్చారు. కంతేరులో లోకేశ్ 14 ఎకరాల భూములు కొనుగోలు చేశారని ఓ యూట్యూబ్ ఛానల్‌లో పోసాని తెలిపారు. అయితే ఒక్క సెంటు భూమి కూడా లేదని.. పోసాని చేసిన ఆరోపణలు సరికాదన్నారు. తనకు పోసాని క్షమాపణలు లోకేశ్ నోటీసులు జారీ చేశారు. అయితే పోసాని నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఎటువంటి ఆధారాలు లేకుండా తనపై పోసాని ఆరోపణలు చేస్తున్నారని, తన పరువుకు భంగం కలిగిందని లోకేశ్ కేసు వేశారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో నారా లోకేశ్‌పై డీజీపీకి పోసాని కృష్ణ మురళి ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది.

Next Story