కలరా కలకలం.. పానీపూరి బండ్లు క్లోజ్

by Naga Rani Yarlagadda |

నగరంలో కలరా, డయేరియా కేసులు నమోదైన నేపథ్యంలో పానీపూరి బండ్లన్నింటినీ క్లోజ్ చేయించినట్లు కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు.

కలరా కలకలం.. పానీపూరి బండ్లు క్లోజ్
X

దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లాలో కలరా కేసులు బయటపడ్డాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మంగళవారం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా.. స్థానిక ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తో కలిసి నగర వీధుల్లో పర్యటించారు. తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు. మూడు కలరా కేసులు నమోదైన తరుణంలో.. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎవరూ భయపడవద్దని, కాచి చల్లార్చిన నీటినే తాగాలని సూచించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కలెక్టర్.. ఓల్డ్ గుంటూరులో 9 హై రిస్క్ ప్రాంతాలను గుర్తించినట్లు తెలిపారు.

ప్రస్తుతం గుంటూరు జీజీహెచ్ లో 92 డయేరియా యాక్టివ్ కేసులు ఉన్నాయని, నగరంలో రాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ ను ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. అలాగే 50 స్పెషల్ వైద్య బృందాలతో ఇంటింటి సర్వే నిర్వహించేలా ఆదేశాలు జారీచేశామని, ట్రేస్ అండ్ ట్రీట్ పద్ధతిలో సర్వే చేయిస్తున్నామని వివరించారు. జిల్లాస్థాయి అధికారిని ఇన్చార్జ్ గా పెట్టి టీమ్స్ ను ఏర్పాటు చేశామని, ఆయా టీమ్స్ కలరా, డయేరియా వ్యాప్తిని అరికట్టే దిశగా పనిచేస్తాయని కలెక్టర్ తెలిపారు. కలరా, డయేరియా కేసులు ఉన్న నేపథ్యంలో నగరంలో పానీపూరి బండ్లను పూర్తిగా క్లోజ్ చేయించినట్లు వెల్లడించారు. ప్రగతినగరం, రాంరెడ్డి తోట ప్రాంతంలో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా జరుగుతుందని చెప్పారు.

Next Story