ట్విస్టుల మీద ట్విస్టులు.. Cm Jagan వెంటే ఆమె ప్రయాణం

by Disha Web Desk 16 |
ట్విస్టుల మీద ట్విస్టులు.. Cm Jagan వెంటే ఆమె ప్రయాణం
X
  • రాజకీయాల్లో ఉన్నంతకాలం వైసీపీలోనే
  • వీడితే గృహిణిగా ఇంట్లోనే
  • దయాసాగర్ పోటీలో లేరు
  • సీఎం జగన్ ఆశీర్వదించి పోటీ చేయమంటే చేస్తా

దిశ, డైనమిక్ బ్యూరో: మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు కడవరకు జగనన్నతోనే అన్నారు. రెండున్నరేళ్ల తర్వాత మంత్రి పదవి పోవడంతో అలిగారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు లీకులు ఇచ్చారు. అనంతరం మళ్లీ తాను వైసీపీలోనే కొనసాగుతానని ప్రకటించారు. ఆ తర్వాత ఓ కార్యక్రమంలో భర్త పార్టీ మారితే భార్యగా తాను కూడా మారాలిగా అంటూ ఆసక్తి వ్యాఖ్యలు చేశారు. ఆ వెంటనే నాలుక్కరచుకుని కాదు కాదు వైసీపీలోనే ఉంటానని చెప్పారు. భర్త కూడా వైసీపీలోనే ఉంటారని పేర్కొన్నారు. ఇలా మాజీ మంత్రి మేకతోటి సుచరిత చేస్తున్న వ్యాఖ్యలు గందరగోళానికి, అయోమయానికి గురి చేస్తున్నాయి.

ఆసక్తికరంగా సుచరిత వ్యవహారశైలి

మాజీ హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత వైఎస్ఆర్ కుటుంబానికి వీరవిధేయురాలు. దివంగత సీఎం వైఎస్ఆర్ 2009లో టికెట్ ఇవ్వడంతో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. అనంతరం వైఎస్ఆర్ మరణం తర్వాత వైఎస్ జగన్ వెంట నడిచారు. వైఎస్ జగన్‌ కోసం ఏకంగా ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేసి ఉపఎన్నికలకు వెళ్లి మరోసారి గెలిచారు. అనంతరం 2014 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికల్లో ఘన విజయం సాధించి వైఎస్ జగన్ కేబినెట్‌లో రెండున్నరేళ్లు కీలకమైన హోంశాఖ మంత్రిగా పని చేశారు. రెండున్నరేళ్ల అనంతరం జరిగిన కేబినెట్ విస్తరణలో మంత్రి పదవి కోల్పోయారు. మంత్రి పదవి కోల్పోవడంతో ఆమె ఆగ్రహానికి గురయ్యారు. దీంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు లీకులు ఇచ్చారు. ఇదే విషయాన్ని ఆమె కుమార్తె సైతం వెల్లడించారు. అనంతరం ఆమె పార్టీ వీడటం లేదని వైసీపీలో కొనసాగుతానని ప్రకటించారు. అప్పటి నుంచి సుచరిత తీరులో మార్పు కనిపిస్తోందనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత నెమ్మదిగా జిల్లా అధ్యక్ష బాధ్యతల నుంచి సుచరిత తప్పుకున్నారు. పోనీలే అంతా సర్దుమణిగింది అనుకుంటున్న వేళ భర్త పార్టీ మారితే భార్యగా తాను కూడా మారాల్సి వస్తుంది కదా అంటూ చేసిన వ్యాఖ్యలు మరోసారి బ్లాస్ట్ అయ్యాయి. అనంతరం ఆమె వివరణ ఇచ్చారు. తాను కానీ తన భర్త కానీ పార్టీ మరమని చెప్పారు.

పార్టీ మారే ఉద్దేశం లేదు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేకతోటి సుచరిత మళ్లీ యాక్టివ్ అయ్యారు. ప్రతీ అంశాన్ని సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. ట్విటర్ వేదికగా టీడీపీ, జనసేనలపై విరుచుకుపడుతున్నారు. అంతేకాదు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో దూసుకెళ్ళిపోతున్నారు. అయినప్పటికీ సుచరిత పార్టీపై అసంతృప్తితో ఉన్నారని పార్టీ మారుతున్నారంటూ వార్తలకు మాత్రం ఫుల్ స్టాప్ పడలేదు. ఈ వార్తలతో కలతచెందిన సుచరిత గురువారం పార్టీ కార్యాలయంలో క్లారిటీ ఇచ్చేశారు. 'సోషల్ మీడియా వేదికగా రకరకాలుగా వినపడుతున్నాయి. ఆ వార్తలను బేస్ చేసుకుని శాటిలైట్ ఛానల్స్‌లో పార్టీ మారతానన్న వార్తలు వస్తున్నాయి. 2019లో నన్ను అభ్యర్థిగా నిలబెట్టిన నాయకుడు జగన్. రాష్ట్రంలో తొలి మహిళ హోంమంత్రిగా నాకు అవకాశం ఇచ్చారు. పార్టీ మారే ఉద్దేశం నాకు లేదు. పార్టీ మారటం అంటే నేను ఇంటికే పరిమితమౌతాను .' అని మాజీమంత్రి మేకతోటి సుచరిత స్పష్టం చేశారు.

వచ్చే ఎన్నికల్లో 175 సీట్లలో గెలుస్తాం

వైసీపీ ప్రభుత్వంలో ప్రతీ గడపకు లబ్ధి చేకూరిందని మాజీహోంశాఖ మంత్రి సుచరిత స్పష్టం చేశారు. ఎవరైనా దళితుల్లో పుట్టాలనుకుంటారా అని చంద్రబాబు అన్నారని, కానీ దళితుల్లో పుట్టటం తన అదృష్టంగా భావిస్తున్నానని ఆమె పేర్కొన్నారు. అర్హత ఉన్న అందరికీ అన్ని పథకాలు అందిస్తున్న పార్టీ వైసీపీ అని చెప్పారు. గత ప్రభుత్వం సరిగా పరిపాలన చేస్తే 23 సీట్లకే పరిమిత మయ్యేవారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విద్యా వ్యవస్థలో పెను మార్పులు తీసుకువచ్చి అందరికీ విద్య అందిస్తున్నారని కొనియాడారు. 'నేను రాజకీయాలలో ఉన్నంతకాలం వైసీపీలోనే ఉంటాను. పార్టీ మారి రాజకీయాలు చేయను. నన్ను రెండున్నర సంవత్సరాలు హోంమంత్రిగా కొనసాగాలని ముఖ్యమంత్రి చెప్పారు. నా ఇంట్లో సొంత మనిషివని జగన్ చెప్పారు. ఎవరు తప్పు చేసినా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది. దానికే ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం లేదు. దయాసాగర్ ప్రస్తుతం పోటీలో లేరు. జగన్ ఆశీర్వదించి ఎక్కడ పోటీ చేయమంటే అక్కడినుంచి పోటీ చేస్తా.. జగన్ వెంటే నా ప్రయాణం' అని మేకతోటి సుచరిత స్పష్టం చేశారు. రాష్ట్రంలో సీఎం జగన్ కులం, మతం ప్రాంతాలు చూడకుండా పథకాలు అందిస్తున్నారు. అటువంటి నాయకుడి వెంటే నా ప్రయాణం సాగుతుంది. ప్రజల మంచి కోరుకునే పార్టీలకి ప్రజాక్షేత్రంలో కూడా మంచే జరుగుతుంది. ఈ సారి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175/175 సాధిస్తుంది.' అని మేకతోటి సుచరిత ధీమా వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి:

Andhra pradesh లో 175కి 175 సాధ్యమేనా...!



Next Story