పార్టీ సంస్థాగతంపై జనసేన మరింత దూకుడు.. దరఖాస్తుల పరిశీలన

by Vemula.Srinu Prasad |

క్షేత్రస్థాయిలో సమర్థ నాయకత్వాన్ని పెంపొందించి, జనసేన పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడమే లక్ష్యమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు.....

పార్టీ సంస్థాగతంపై జనసేన మరింత దూకుడు.. దరఖాస్తుల పరిశీలన
X

దిశ, ఏపీ బ్యూరో: క్షేత్రస్థాయిలో సమర్థ నాయకత్వాన్ని పెంపొందించి, జనసేన పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడమే లక్ష్యమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో నిర్వహించిన 'మెంబర్‌షిప్ టు లీడర్‌షిప్' కార్యక్రమం కింద ఆరు రోజులుగా సాగిన దరఖాస్తుల సేకరణ ప్రక్రియ ఆదివారంతో విజయవంతంగా ముగిసిందని తెలిపారు.

ఈ సందర్భంగా జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ సభ్యులను మంత్రి సత్కరించగా, సభ్యులు కూడా మంత్రిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి వేలాది మంది జనసైనికులు, వీరమహిళలు హాజరై వివిధ కమిటీల్లో బాధ్యతల కోసం దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుదారుల కోసం ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేయడంతో పాటు, విజయవాడ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. మంత్రి దుర్గేశ్‌తో పాటు సీనియర్ నాయకులు, సాధక్ ప్రతినిధులు, అబ్జర్వర్ల బృందం ప్రతి దరఖాస్తును పరిశీలించింది.

మంత్రి దుర్గేశ్ మాట్లాడుతూ జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆశయాలు, పార్టీ సిద్ధాంతాలపై విశ్వాసంతో వేలాదిగా ముందుకొచ్చిన కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసే వారికి సముచిత గుర్తింపు, గౌరవం ఉంటుందని స్పష్టం చేశారు. దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం అధినేత పవన్ కల్యాణ్ తుది ఎంపిక చేపడతారని తెలిపారు. ఆగస్టు నాటికి ఎంపిక ప్రక్రియ పూర్తవుతుందని, అనంతరం నూతన కమిటీలతో కలిసి విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో జనసేనను మరింత బలోపేతం చేసే దిశగా పనిచేస్తామని మంత్రి పేర్కొన్నారు.

Next Story