ఒమన్‌లో తెలుగు మహిళ... సీఎం చొరవతో ఇండియాకు రప్పించేందుకు ఏర్పాట్లు

by Vemula.Srinu Prasad |

ఉద్యోగం కోసం వెళ్లి ఒమన్‌లో కష్టాలుపడుతున్న అన్నమయ్య జిల్లాకు చెందిన ఓ మహిళ ‘తనను రక్షించాలంటూ.. లేకపోతే ఇక్కడ తనను చంపేస్తారంటూ’ వీడియోలో కూటమి ప్రభుత్వ నేతలను వేడుకున్న సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ బాధితురాలికి భరోసా ఇచ్చారు.

ఒమన్‌లో తెలుగు మహిళ... సీఎం చొరవతో ఇండియాకు రప్పించేందుకు ఏర్పాట్లు
X

దిశ, ఏపీ బ్యూరో: ఉద్యోగం కోసం వెళ్లి ఒమన్‌లో కష్టాలుపడుతున్న అన్నమయ్య జిల్లాకు చెందిన ఓ మహిళ ‘తనను రక్షించాలంటూ.. లేకపోతే ఇక్కడ తనను చంపేస్తారంటూ’ వీడియోలో కూటమి ప్రభుత్వ నేతలను వేడుకున్న సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ బాధితురాలికి భరోసా ఇచ్చారు. ఆమెకు ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. వలస కార్మికుల భద్రతకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందన్నారు. ఏపీఎన్‌ఆర్టీ చొరవను ఈ సందర్భంగా సీఎం అభినందించారు. అన్నమయ్య జిల్లా వయలపాడు గ్రామానికి చెందిన దూదేకుల షహ్నాజ్‌ గతేడాది నవంబరులో ఉద్యోగం మస్కట్‌ వెళ్లారు. ఉద్యోగం నచ్చక తిరిగి స్వదేశానికి రావాలనుకున్నారు. అయితే షహ్నాజ్‌ ఫోన్‌ స్వాధీనం చేసుకున్న ఏజెంట్లు, ఖర్చులకు రూ. 2 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సమాచారం తెలుసుకున్న షహ్నాజ్‌ భర్త ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఏపీఎన్‌ఆర్టీకి ఫిర్యాదు చేశారు. ఏపీ ప్రభుత్వం, ఏపీఎన్‌ఆర్టీ సొసైటీ వెంటనే స్పందించి ఒమన్‌లోని భారత ఎంబసీకి లేఖ రాశాయి. ఏపీ పోలీసులు కూడా జోక్యం చేసుకొని ఏజెంట్లతో చర్చలు జరిపారు. ఖర్చులు భరించి షహ్నాజ్‌ను తిరిగి ఏపీకి పంపేందుకు ఏజెంట్లు ఆంగీకరించారు. మే 7న ఆమె స్వదేశానికి చేరుకోనున్నట్లు సమాచారం.

Next Story