పర్యావరణ దినోత్సవం.. 2.5 కోట్ల సీడ్‌ బాల్స్‌ తయారీని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

by Malleboina Mahesh |

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా 'అమ్మ పేరుతో మొక్క' నాటిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమానికి శ్రీకారం.

పర్యావరణ దినోత్సవం.. 2.5 కోట్ల సీడ్‌ బాల్స్‌ తయారీని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
X

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan) మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణపై కీలకమైన అడుగు వేశారు. ఎన్టీఆర్ జిల్లాలోని మూలపాడు బటర్‌ఫ్లై పార్క్‌ను సందర్శించిన ఆయన, అక్కడ ఒక మొక్కను నాటారు. తన తల్లి అంజనా దేవి గారి పేరిట ‘తెల్ల పొణికి’ మొక్కను నాటిన డిప్యూటీ సీఎం, సమాజంలో పచ్చదనం పెంచేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ‘అమ్మ పేరుతో ఒక మొక్క’ నాటాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కొండపల్లి బొమ్మల తయారీకి వాడే అత్యంత విశిష్టమైన ఈ 'తెల్ల పొణికి' మొక్కను నాటడం ద్వారా ఆయన ప్రకృతి సంరక్షణ సందేశాన్ని అందించారు.

2.5 కోట్ల సీడ్ బాల్స్ మహోద్యమం..

మొక్కలు నాటడంతో పాటు రాష్ట్రంలో అడవుల శాతాన్ని, పచ్చదనాన్ని పెంపొందించడం కోసం ఒక భారీ వన మహోత్సవ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారు. రాష్ట్రవ్యాప్తంగా అటవీ ప్రాంతాలు, ఖాళీ ప్రదేశాలలో చల్లడం కోసం ఏకంగా 2.5 కోట్ల సీడ్ బాల్స్ (విత్తనపు బంతులు) తయారు చేయడమే లక్ష్యంగా సాగే ఈ భారీ కార్యక్రమాన్ని ఆయన అధికారికంగా ప్రారంభించారు. పర్యావరణ సమతుల్యతను కాపాడటానికి, భావితరాలకు స్వచ్ఛమైన గాలిని అందించడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని, ప్రజలందరూ ఇందులో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కోరారు.

Next Story