Ap News: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్

by Disha Web Desk 16 |
Ap News: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్రవిద్యాశాఖ మంత్రి ఓ ప్రకటన చేశారు. దీనికి సంబంధించిన వివరాలను అధికారులు సిద్ధం చేస్తున్నారని తెలిపారు. అమరావతిలో శుక్రవారం మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. డీఎస్సీ నోటిఫికేషన్‌కు సంబంధించి సీఎం వైఎస్ జగన్ విధానపరమైన నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. ఇప్పటికే ఉపాధ్యాయులు, ఉద్యోగుల బదిలీలపై సమీక్ష నిర్వహించినట్లు వెల్లడించారు. త్వరలోనే బదిలీలపై నిర్ణయం తీసుకుంటామని.. వచ్చే విద్యాసంవత్సరానికి బదిలీ ప్రక్రియ చేపడతామని తెలిపారు.

పారదర్శకంగా బదిలీలు

బదిలీలకు పారదర్శకమైన విధానాన్ని తీసుకొస్తామని ఇందుకు అవసరమైన ఇతర రాష్ట్రాలలోని అంశాలను కూడా పరిశీలిస్తున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. అలాగే కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. ఇదే అంశాన్ని ఒప్పంద అధ్యాపకులకు తెలియజేశామని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు.

మూడు రాజధానులు వైసీపీ పాలసీ

పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానులకు వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. విశాఖపట్నం పరిపాలన రాజధాని అనేది తమ ప్రభుత్వ పాలసీ అని మరోసారి క్లారిటీ ఇచ్చారు. అమరావతి రాజధాని అయితే చంద్రబాబు కాపురం హైదరాబాద్‌లో ఎందుకు పెట్టారని ఎదురు ప్రశ్నించారు. కాపురానికి, రాజధానికి సంబంధం ఏంటని నిలదీశారు.

మరోవైపు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమని మంత్రి బొత్స వెల్లడించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కొందరు నేతలు బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం దురదృష్టకరమన్నారు.స్టీల్ ప్లాంట్ కేంద్రం ఆధీనంలోనే ఉండాలనేది తమ అభిమతమని స్పష్టం చేశారు. విద్యార్థులకు రాగి జావ నిలిపేశామంటూ వస్తున్న ప్రచారాన్ని ఖండించారు. పరీక్షలు, ఒంటిపూట బడుల వల్లే చిక్కీలు ఇస్తున్నామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వివరణ ఇచ్చారు.



Next Story

Most Viewed