వైకల్యాన్ని జయించి.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను అధిరోహించిన 21 మంది ఏపీ విద్యార్థులు

by Ramesh Naini |

శారీరక వైకల్యం వారి ఆత్మవిశ్వాసాన్ని అడ్డుకోలేకపోయింది. విమర్శలను, అవమానాలను పక్కనపెట్టి, అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 21 మంది దివ్యాంగ విద్యార్థులు సరికొత్త చరిత్ర సృష్టించారు.

వైకల్యాన్ని జయించి.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను అధిరోహించిన 21 మంది ఏపీ విద్యార్థులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: శారీరక వైకల్యం వారి ఆత్మవిశ్వాసాన్ని అడ్డుకోలేకపోయింది. విమర్శలను, అవమానాలను పక్కనపెట్టి, అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 21 మంది దివ్యాంగ విద్యార్థులు సరికొత్త చరిత్ర సృష్టించారు. 5,364 మీటర్ల ఎత్తులో ఉన్న మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను వీరు విజయవంతంగా అధిరోహించారు. వివిధ రకాల వైకల్యాలున్న 21 మంది విద్యార్థులు ఒకే బృందంగా ఏర్పడి ఈ ఘనత సాధించడం ప్రపంచంలోనే ఇదే తొలిసారి.

కఠిన శిక్షణ.. అచంచల పట్టుదల

రాష్ట్ర ప్రభుత్వ సహకారం, సమగ్ర శిక్షా అభియాన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10, ఇంటర్ చదువుతున్న 21 మంది (8 మంది బాలికలు, 13 మంది బాలురు) ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులను ఈ సాహసయాత్రకు ఎంపిక చేశారు. వీరికి తొలుత గండికోట అడ్వెంచర్ అకాడమీలో 45 రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. ఆ తర్వాత లద్దాఖ్‌లో మైనస్ 5 డిగ్రీల చలిలో 15 రోజుల పాటు కఠిన శిక్షణ అందించారు. అనంతరం ఏప్రిల్ 15న నేపాల్ రాజధాని కాఠ్మాండు నుంచి ప్రారంభమైన వీరి యాత్ర శనివారం విజయవంతంగా బేస్ క్యాంప్‌కు చేరుకుంది.

ఆత్మవిశ్వాసానికి ఆకాశమే హద్దు: మంత్రి లోకేశ్

ఈ సాహస యాత్రను స్వయంగా ప్రారంభించిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, విద్యార్థుల అద్భుత విజయం పట్ల తీవ్ర హర్షం వ్యక్తం చేశారు. ఆత్మవిశ్వాసం ఉంటే ఆకాశమే హద్దు అని ఈ విద్యార్థులు యావత్ ప్రపంచానికి నిరూపించారని, వీరు రేపటి తరానికి ‘రోల్ మోడల్స్’ అని ఆయన కొనియాడారు. వైకల్యాన్ని అడ్డంకిగా భావించే లోకానికి వీరి విజయం గొప్ప సమాధానమని పేర్కొన్నారు. సరైన అవకాశాలు కల్పిస్తే దివ్యాంగ విద్యార్థులు అద్భుతాలు సృష్టిస్తారని, ఇలాంటి వినూత్న కార్యక్రమాల ద్వారా వారిని ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. విద్యార్థుల రక్షణను విజయవంతంగా పర్యవేక్షించిన ఉన్నతాధికారులను ఆయన అభినందించారు.

Next Story