సీఎం జగన్ నివాసంలో ఘనంగా సంబురాలు.. భోగి మంటలను వెలిగించిన జగన్ దంపతులు

by Disha Web Desk 1 |
సీఎం జగన్ నివాసంలో ఘనంగా సంబురాలు.. భోగి మంటలను వెలిగించిన జగన్ దంపతులు
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలుగు వెలుగులు విరజిమ్మేలా పచ్చని లోగిళ్లలో సీఎం జగన్ ఇంట సంక్రాంతి సంబరాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ప్రజలతో మమేకమై సీఎం ప్రతి సంవత్సరం లాగానే సంక్రాంతి వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం తాడేపల్లి సీఎం క్యాపు కార్యాలయం వద్ద సీఎం వైఎస్‌ జగన్, భారతి దంపతులు సంప్రదాయ దుస్తులు ధరించి సంక్రాంతి సంబురాల్లో పాల్గొన్నారు. మొదటి వారిద్దరూ భోగి మంటలను వెలిగించి కార్యక్రమాలను ప్రారంభించారు. బసవన్నలకు సారె, గోపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. సంబురాల సందర్భంగా ప్రముఖ శాస్త్రీయ నృత్య కళాకారుల ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేశారు. ప్రభుత్వ విప్‌ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి పర్యవేక్షణలో ఈవెంట్స్ జరుగుతున్నాయి.

పండుగ సందర్భంగా సీఎం జగన్ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఊరూ వాడా ఒక్కటై.. బంధు మిత్రులు ఏకమై..అంబరమంత సంబరంగా జరుపుకొనే తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి. భోగి మంటల సాక్షిగా చెడును దహనం చేసి.. సంతోషాల కాంతిని ఇంటి నిండా నింపుకొని. సుఖ సంతోషాలతో..విజయానందాలతో ప్రతి ఒక్కరూ అడుగులు ముందుకు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా’’ అంటూ ట్వీట్‌ చేశారు.



Next Story