MP Vijayasai Reddy : వైసీపీ మద్దతుతోనే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు

by Disha Web Desk 21 |
MP Vijayasai Reddy : వైసీపీ మద్దతుతోనే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు
X

దిశ, డైనమిక్ బ్యూరో : జాతీయ రాజకీయాల్లో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2024లో కేంద్రంలో వైసీపీ మద్దతుతోనే ప్రభుత్వం ఏర్పడుతుందని జోస్యం చెప్పారు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా అందులో వైసీపీదే కీలక పాత్ర అని చెప్పుకొచ్చారు. ఈ మేరకు సోమవారం ట్వీట్ చేశారు ఎంపీ విజయసాయిరెడ్డి. మరికొన్ని నెలల్లోనే పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అటు విపక్షాలు ఇటు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు రాజకీయ వ్యూహరచనలు చేస్తున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు విపక్షాలన్నీ కూటమిగా ఏర్పడుతున్నాయి. కాంగ్రెస్ నేతృత్వంలో ఈ కూటమి ఏర్పడబోతుంది. ఈ కూటమికి సంబంధించి ఇప్పటికే విపక్షాలన్నీ వరుస భేటీలు అయిన సంగతి తెలిసిందే. మరోవైపు విపక్షాల కూటమికి తన సత్తా ఏంటో తెలిపేందుకు అటు బీజేపీ సైతం ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలతో ఈనెల 18న భేటీ ఏర్పాటు చేయనుంది. ఇలాంటి తరుణంలో ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.‘30 పార్టీలతో కూడిన ఎన్డీయే ఢిల్లీలో.. 24 విపక్ష పార్టీలు బెంగళూరులో సమావేశమవుతున్నాయి. అయితే ఈసారి 2024లో ఢిల్లీకి వెళ్లే మార్గం ఏపీ గుండా వెళుతుంది. కేంద్రంలో ప్రభుత్వం వైసీపీ మద్దతోనే సాధ్యం. వైసీపీకి ఏపీ ప్రజల ఆశీర్వాదం, ప్రజాభిమానం ఉంది. జాతీయ మీడియాతో సహా ఇప్పటివరకు చేసిన అన్ని సర్వేలు వైసీపీ మళ్లీ విజయం సాధిస్తుందని స్పష్టం చేస్తున్నాయి’అని విజయసాయిరెడ్డి గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో తమ పార్టీ సత్తాను గుర్తించాలని పరోక్షంగా ఎంపీ విజయసాయిరెడ్డి పార్టీలకు పరోక్షంగా గుర్తు చేస్తున్నారు. గతంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో చేరకపోయినా పలు బిల్లుల విషయాల్లో వైసీపీ బయట నుంచి మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి ఖచ్చితంగా భాగస్వామ్య పార్టీగా ఉండాలని వైసీపీ ఉవ్విళ్లూరుతున్నట్లు తెలుస్తోంది.

Next Story

Most Viewed