- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళలకు సర్కార్ గుడ్న్యూస్.. 2.20 లక్షల మందికి కొత్త వితంతు పింఛన్లు!
ఏపీలో కొత్త పింఛన్ల కోసం నిరీక్షిస్తున్న మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది.

దిశ, డైనమిక్ బ్యూరో : ఏపీలో కొత్త పింఛన్ల కోసం నిరీక్షిస్తున్న మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. త్వరలో కొత్తగా 2.20 లక్షల మందికి (widow pensions) వితంతు పింఛన్లను మంజూరు చేయనున్నట్లు సెర్ప్, ఎన్ఆర్ఐ, ఎంఎస్ఎంఈ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ (minister Kondapalli Srinivas) ప్రకటించారు. రానున్న ఒకటి, రెండు నెలల్లో అర్హులకు ప్రతి నెలా రూ.4,000 చొప్పున ఆర్థిక సాయం అందించేలా మార్గదర్శకాలను సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.
పింఛన్ల పంపిణీలో ఏపీదే అగ్రస్థానం
రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 62.34 లక్షల మందికి సామాజిక భద్రతా పింఛన్లు అందిస్తున్నామని, ఇందుకోసం ఏటా రూ.33 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు మంత్రి వివరించారు. దేశంలో అత్యధికంగా పింఛన్లు ఇస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశేనని స్పష్టం చేశారు. పింఛను తీసుకునే భర్త మరణిస్తే, ఆ కుటుంబం ఇబ్బంది పడకుండా తక్షణమే భార్యకు ‘స్పౌజ్ కేటగిరీ’ కింద పింఛను బదిలీ చేస్తున్నామని, ఇలా ఇప్పటికే 2.45 లక్షల మందికి లబ్ధి చేకూర్చామని తెలిపారు.
విపక్షాల ఆరోపణల్లో వాస్తవం లేదు
పింఛన్ల తొలగింపుపై విపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారాన్ని మంత్రి తీవ్రంగా ఖండించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 9.56 లక్షల పింఛన్లను దారుణంగా తొలగిస్తే, ప్రస్తుత కూటమి ప్రభుత్వం నిబంధనల మేరకు కేవలం 7,856 అనర్హుల పింఛన్లను మాత్రమే తొలగించిందన్నారు. దివ్యాంగులు, ఆరోగ్య సమస్యలున్న వారి పింఛన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు చేయలేదని ఆయన స్పష్టం చేశారు.






