అవిశ్వాస తీర్మానం వేళ: జగన్ సర్కార్‌కు కేంద్రం తీపికబురు..ఆ ఖర్చు భరిస్తామని హామీ

by Disha Web Desk 21 |
అవిశ్వాస తీర్మానం వేళ: జగన్ సర్కార్‌కు కేంద్రం తీపికబురు..ఆ ఖర్చు భరిస్తామని హామీ
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరం ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి శుభవార్త తెలిపింది. ప్రాజెక్ట్‌లో కేవలం సాగు నీటి విభాగం పనులకు మాత్రమే నిధులు ఇస్తామని, తాగు నీటి విభాగం కోసం చేసే ఖర్చును భరించే ప్రసక్తే లేదంటూ ఇన్నాళ్ళు మొండికేసిన కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం పదే పదే చేసిన విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకుని తాగునీటి విభాగానికి ప్రతిపాదించిన వ్యయాన్ని కూడా తిరిగి చెల్లించడానికి సుముఖత వ్యక్తం చేసింది.రాజ్యసభలో సోమవారం వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయి రెడ్డి పోలవరం ప్రాజెక్ట్‌ సవరించిన అంచనా వ్యయంకు సంబంధించిన 55,548 కోట్ల రూపాయల నిధుల గురించి అడిగిన ప్రశ్నకు జలశక్తి సహాయ మంత్రి బిశ్వేశ్వర్‌ తుడు జవాబిస్తూ పోలవరం ప్రాజెక్ట్‌లో ఇరిగేషన్‌ విభాగానికి సంబంధించి మిగిలిపోయిన పనులు పూర్తి చేయడానికి 10,911.15 కోట్లు, వరదల కారణంగా దెబ్బతిన్న ప్రాజెక్ట్‌ నిర్మాణంలో మరమ్మతు పనుల నిమిత్తం అదనంగా మరో 2 వేల కోట్ల రూపాయలు విడుదల చేయడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన వ్యయ విభాగం నిరభ్యంతరం తెలిపిందని పేర్కొన్నారు. అలాగే తాగునీటి విభాగానికి సంబంధించిన ప్రతిపాదిత ఖర్చును రాష్ట్ర ప్రభుత్వానికి తిరిగి చెల్లించేందుకు ఆ విభాగం ఎలాంటి అభ్యంతరం లేదని తమకు సమాచారం ఇచ్చిందని మంత్రి చెప్పారు.

పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణంలో ఇప్పటి వరకు కాంపోనెంట్‌ వారీగా జరిగిన పనులకు కేంద్రం నిధులు చెల్లిస్తూ వస్తోంది. కాంపోనెంట్‌ వారీగా నిధుల చెల్లింపు వలన ప్రాజెక్ట్‌ నిర్మాణ పనుల్లో తీవ్ర జాప్యం నెలకొంటోందని రాష్ట్ర ప్రభుత్వం అనేక పర్యాయాలు కేంద్ర ప్రభుత్వానికి విన్నవించింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఢిల్లీ పర్యటనల్లో ఇదే విషయాన్ని పలుమార్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ దృష్టికి తీసుకువచ్చి కాంపోనెంట్‌ వారీ చెల్లింపులపై సీలింగ్‌ను ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్ట్‌లో కాంపోనెంట్‌ వారీ సీలింగ్‌ను ఎత్తివేస్తున్నట్లుగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోని వ్యయ విభాగం గత జూన్‌ 5న తమకు రాసిన లేఖలో స్పష్టం చేసినట్లు జలశక్తి సహాయ మంత్రి బిశ్వేశ్వర్‌ తుడు వెల్లడించారు.

Read More : ఏపీ అప్పులపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన

Next Story

Most Viewed