విద్యార్థులకు గుడ్ న్యూస్.. ‘రాగిజావ’ పంపిణీ మరో మూడేళ్లు పొడిగిస్తూ ఎంవోయూ

by Vemula.Srinu Prasad |

ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు సన్నబియ్యంతో పాటు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా కూటమి ప్రభుత్వం అందిస్తోంది....

విద్యార్థులకు గుడ్ న్యూస్.. ‘రాగిజావ’ పంపిణీ మరో మూడేళ్లు పొడిగిస్తూ ఎంవోయూ
X

దిశ, వెబ్ డెస్క్: ప్రభుత్వ(Government), ఎయిడెడ్ పాఠశాలల్లో(Aided Schools) ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు సన్నబియ్యంతో పాటు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం(Dokka Seethamma Mid-Day Meal Scheme) ద్వారా కూటమి ప్రభుత్వం అందిస్తోంది. మెనూలో మార్పులతో ఎక్కువమంది భోజనం చేస్తున్నారు. భోజనం మరింత రుచి, శుచిగా వడ్డించేలా మంత్రిగా నారా లోకేష్(Minister Nara Lokesh) ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు అదనపు పోషకాహారం అందించే నిమిత్తం శ్రీ సత్యసాయి సేవా ట్రస్ట్ సహకారంతో ప్రస్తుతం అమలులో ఉన్న రాగిజావ(Ragi Malt) పంపిణీ కార్యక్రమం మరో మూడేళ్లు కొనసాగింపునకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంత్రి నారా లోకేష్ సమక్షంలో 2026-29 కాలానికి విద్యార్థులకు రాగిజావ పంపిణీ కార్యక్రమం కొనసాగించేందుకు శ్రీ సత్యసాయి సేవా ట్రస్ట్‌తో విద్యాశాఖ ఎంవోయూ కుదుర్చుకుంది. శ్రీ సత్యసాయి సేవా ట్రస్ట్ సహకారంతో రాగిజావ పంపిణీ కార్యక్రమం మార్చి 2023లో ప్రారంభం కాగా.. ఈ ఏడాది ఏప్రిల్ తో కాలపరిమితి ముగిసింది. దీంతో పొడిగింపునకు విద్యాశాఖ ఎంవోయూ కుదుర్చుకుంది.

జోనల్ వారీగా మెనూ..

ప్రస్తుతం డొక్కా సీతమ్మ(Dokka Seethamma Mid-day meal scheme) మధ్యాహ్న భోజన పథకంలో జోనల్ వారీగా విద్యార్థులకు మెనూ అమలుచేస్తున్నారు. ఈ మెనూలో ఫోర్టిఫైడ్ ఫైన్ రైస్, వారానికి 5 సార్లు గుడ్డు, వారానికి మూడు సార్లు చిక్కీ, అలాగే పోషకాహారపు పదార్థులుగా చిక్కీలేని రోజుల్లో రాగిజావను వారానికి మూడు సార్లు అందిస్తున్నారు. మధ్యాహ్న భోజన పథకంపై ప్రభుత్వం ఏడాదికి సుమారు 1,850 కోట్లు ఖర్చుచేస్తోంది. తద్వారా విద్యార్థుల ఎన్ రోల్ మెంట్, అటెండెన్స్, డ్రాప్ అవుట్స్ నివారణ, పోషకస్థాయిలు మెరుగుపరచడమే లక్ష్యంగా పెట్టుకుంది.

మూడేళ్లలో రూ.80 కోట్లు కేటాయింపు

విద్యార్థులకు హెల్త్ సప్లిమెంట్‌గా రాగిజావను పంపిణీ చేస్తున్నారు. 10 గ్రాముల రాగి పిండి, 10 గ్రాముల బెల్లం పొడిని 150 మిల్లీలీటర్ల వేడినీటిలో కలిపి విద్యార్థులకు అందించడం జరుగుతోంది. తద్వారా కాల్షియం, ఐరన్‌తో సమృద్ధిగా ఉండి పోషకాహారాన్ని మెరుగుపరుస్తుంది. రాగిపిండి, బెల్లంపొడిని శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఉచితంగా అందిస్తుంది. ట్రస్ట్ ద్వారా జిల్లా కేంద్రాల వరకు సరఫరా చేస్తారు. అక్కడి నుంచి పౌరసరఫరాల శాఖ ద్వారా పాఠశాలలకు పంపిణీ చేస్తారు. ఇందుకోసం మూడేళ్లలో రూ.80 కోట్ల వరకు వెచ్చించనున్నారు.

Next Story