వైసీపీకి మరో ఎంపీ గుడ్ బై.. ఆ పార్టీలో చేరేందుకు సన్నాహాలు

by Disha Web Desk 18 |
వైసీపీకి మరో ఎంపీ గుడ్ బై.. ఆ పార్టీలో చేరేందుకు సన్నాహాలు
X

దిశ ప్రతినిధి,ఉభయగోదావరి:వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎంపీ రాజీనామా చేయనున్నారు.ప్రస్తుతం అమలాపురం ఎంపీగా ఉన్న చింతా అనురాధ వైకాపాను వీడేందుకు సిద్ధమయ్యారు.గత కొద్దిరోజులుగా అసంతృప్తితో ఉన్న చింతా అనురాధ ఆ పార్టీని వీడి బీజేపీలో చేరనున్నారు.ఈ మేరకు ఆమె భర్త టిఎస్ఎన్ మూర్తి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిని కలిశారు. పి.గన్నవరం టికెట్ హామీ లభించడంతో బీజేపీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుత ఎన్నికల్లో జగన్ ఎంపీ అనురాధకు షాక్ ఇచ్చారు.ఈసారి ఆమెకు టికెట్ ఇవ్వకపోగా ఆమె స్థానం రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కు అవకాశం ఇచ్చారు. దీంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.ఇటీవల ఓ సమావేశంలో రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ చేసిన ప్రకటనతో ఎంపీ అనురాధ నొచ్చుకున్నారు. తనను జగన్ అమలాపురం ఎంపీ స్థానం నుంచి పోటీ చేయమని అడుగుతున్నారని బాహాటంగా చెప్పడంతో ఆమె అసంతృప్తికి గురయ్యారు.అందుకు తగ్గట్టుగానే ఇటీవల ప్రకటించిన ఎంపీ అభ్యర్థుల జాబితాలో ఆమెకు చోటు దక్కలేదు. అప్పటి నుంచి ఆమె వైసీపీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు.

బీజేపీ హైకమాండ్ సైతం గెలుపు గుర్రాలను ఎంపిక చేస్తుంది. అందులో భాగంగా అమలాపురం ఎంపీ అనురాధకు పిలుపు వచ్చినట్లు సమాచారం.దీంతో ఆమె భర్త టిఎస్ఎన్ మూర్తి బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిని కలిసినట్లు తెలుస్తోంది.పొత్తులో భాగంగా పి.గన్నవరం అసెంబ్లీ సీటు బీజేపీకి దక్కితే అక్కడి నుంచి పోటీ చేయాలని అనురాధ భావిస్తున్నారు.కాగా ఇప్పటివరకు ఆ స్థానం టీడీపీ పరిధిలో ఉంది. మహాసేన రాజేష్ కు చంద్రబాబు ఆ స్థానాన్ని కేటాయించడంతో టీడీపీ, జనసేన శ్రేణుల నుంచి అభ్యంతరాలు వచ్చాయి. దీంతో అక్కడ మహాసేన రాజేష్ మార్పు అనివార్యం గా తెలుస్తోంది.అదే జరిగితే అక్కడ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగే అవకాశం ఉంది.



Next Story

Most Viewed