ఏసీబీ వలలో గిద్దలూరు ఇన్‌ఛార్జి సబ్‌రిజిస్ట్రార్‌.. ఏకకాలంలో పలుచోట్ల సోదాలు!

by Naga Rani Yarlagadda |

గిద్దలూరు ఇన్ ఛార్జి సబ్ రిజిస్ట్రార్ గా పనిచేసిన కృష్ణమోహన్ రావు ఇంటిలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు.

ఏసీబీ వలలో గిద్దలూరు ఇన్‌ఛార్జి సబ్‌రిజిస్ట్రార్‌.. ఏకకాలంలో పలుచోట్ల సోదాలు!
X

దిశ, వెబ్‌డెస్క్ : అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు మరో భారీ వేట మొదలుపెట్టారు. గిద్దలూరు ఇన్‌ఛార్జి సబ్‌రిజిస్ట్రార్‌గా పనిచేసిన కృష్ణమోహన్‌రావు అక్రమాస్తుల గుట్టు రట్టు చేసేందుకు అధికారులు రంగంలోకి దిగారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే పక్కా సమాచారంతో శనివారం తెల్లవారుజాము నుంచే ఒంగోలు ఏసీబీ అధికారులు ఆయన నివాసాలు, కార్యాలయాలపై మెరుపు దాడులు నిర్వహించారు.

బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు

కేవలం కృష్ణమోహన్‌రావు నివాసంలోనే కాకుండా, ఆయనకు సంబంధించిన కీలక ప్రాంతాల్లో ఏసీబీ బృందాలు తనిఖీలు చేపట్టాయి. చీరాల, కడవకుదురు, నందూరు ప్రాంతాల్లో నివసిస్తున్న ఆయన బంధువుల ఇళ్లలో కూడా అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో కీలకమైన ఆస్తి పత్రాలు, బ్యాంక్ లాకర్ల వివరాలు, నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

కాగా.. కృష్ణమోహన్‌రావు ప్రస్తుతం అమ్మనబ్రోలు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే గతంలో ఆయన గిద్దలూరు ఇన్‌ఛార్జి సబ్‌రిజిస్ట్రార్‌గా పనిచేసిన కాలంలో భారీగా అక్రమాలకు పాల్పడి ఆస్తులు కూడబెట్టారనే అభియోగాలు వచ్చాయి. దీనిపై నిఘా పెట్టిన ఒంగోలు ఏసీబీ విభాగం, పక్కా ఆధారాలతో ఈ సోదాలకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. సాయంత్రానికి ఆయన వద్ద పట్టుబడిన మొత్తం ఆస్తుల విలువపై అధికారులు అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ దాడులతో రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల్లో ఒక్కసారిగా కలకలం రేగింది.

Next Story