Free bus journey: రేపటి నుంచే ఫ్రీ బస్​

by Thanuru Gopichand |   (  Updated:2025-08-14 11:12:59  IST  )

ఏపీలో మహిళలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం పథకం రేపు ప్రారంభం కానుంది.

Free bus journey: రేపటి నుంచే ఫ్రీ బస్​
X

సర్వం సిద్ధం చేసిన ఏపీఎస్​ఆర్టీసీ

రేపు విజయవాడలో సీఎం చంద్రబాబు చేతులమీదుగా ప్రారంభం

74 శాతం బస్సుల్లో స్త్రీ శక్తి పథకం అమలు

మహిళలు ఎదురుచూపులకు రేపు సాకారం

దిశ, డైనమిక్ ​బ్యూరో : ఏపీలో మహిళలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం పథకం రేపు ప్రారంభం కానుంది. ఇందుకోసం ఇప్పటికే ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రేపు సాయంత్రం 5 గంటలకు విజయవాడ బస్టాండులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాంఛనంగా ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఆ తర్వాత ఫ్రీ బస్ ప్రయాణం అమలు కానుంది. ఈ పథకం పేరును రాష్ట్ర ప్రభుత్వం 'స్త్రీ శక్తి'గా ప్రకటించింది. సూపర్‌సిక్స్‌ హామీల్లో భాగంగా ఈ పథకం అమలు చేయనున్నట్లు వెల్లడించింది. మహిళలు, ట్రాన్స్‌జెండర్లకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నారు. పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌‌ప్రెస్, అల్ట్రా ఎక్స్‌‌ ప్రెస్‌ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. మహిళలు బస్సు ఎక్కిన తర్వాత వారికి జీరో టికెట్​ఇస్తారు. ఈ మేరక్​టికెట్​మిషన్లలో సాఫ్ట్​వేర్​అప్​డేట్​పూర్తయింది. టికెట్​ధర ఎంత అనే వివరాలు దానిపై ఉంటాయి. ఆ మొత్తాన్ని ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లిస్తుంది. మహిళలు ఏపీకి చెందిన ఆధార్​, రేషన్​కార్డు, ఓటరు ఐడీ, పాన్​కార్డుల్లో ఏదో ఒకటి చూపించి బస్సులో ప్రయాణించవచ్చు. నాన్‌ స్టాప్‌ బస్సులు, అల్ట్రా డీలక్స్, సూపర్‌ లగ్జరీ, గరుడ, ఇంద్ర ఏసీ బస్సులకు ఈ పథకం వర్తించదు.

8514 బస్సుల్లో అవకాశం

మొత్తంగా 8,514 బస్సుల్లో స్త్రీ శక్తి పథకాన్ని అమలు చేయనున్నారు. ఆర్టీసీలోని 74 శాతం బస్సుల్లో ఈ స్త్రీ శక్తి పథకం అమలు కానుంది. ఇందుకోసం ఏడాదికి ప్రస్తుత లెక్కల ప్రకారం రూ.1,942 కోట్లు ఖర్చు కానున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఇప్పటికే కర్ణాటక, తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలవుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలిరోజుల్లో ఈ పథకంపై అమలుపై అధ్యయనం చేయడానికి మంత్రుల కమిటీని వేశారు. కర్ణాటక, తెలంగాణలలో అమలవుతున్న విధానాలను అధ్యయనం చేసి పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించారు

Next Story