ఒంగోలులో షాకింగ్.. నీటికుంటలో నలుగురు చిన్నారుల గల్లంతు

by Vemula.Srinu Prasad |

ప్రకాశం జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. ఆడుకుంటూ నలుగురు చిన్నారులు నీటికుంటలో పడ్డారు. వెంటనే గల్లంతయ్యారు. ..

ఒంగోలులో షాకింగ్.. నీటికుంటలో నలుగురు చిన్నారుల గల్లంతు
X

దిశ, వెబ్ డెస్క్: ప్రకాశం జిల్లా ఒంగోలు(Prakasam District Ongole)లో గుండెల్ని పిండేసే ఘటన వెలుగుచూసింది. ఎంతో ఉల్లాసంగా, సరదాగా ఆడుకుంటూ కాలక్షేపం చేస్తున్న నలుగురు చిన్నారులు ప్రమాదవశాత్తూ చెరువుకొమ్ముపాలెం వద్ద ఉన్న నీటికుంటలో పడిపోయారు. నీటి లోతు ఎక్కువగా ఉండటంతో ఆ నలుగురు పిల్లలు క్షణాల వ్యవధిలోనే నీట మునిగి, అక్కడికక్కడే గల్లంతయ్యారు. చెరుకుపాలేనికి చెందిన దినేశ్, పొందిలి చిన్ను, కరేటి సుశాంత్, కరేటి అభిరామ్‌గా గుర్తించారు.

చిన్నారిని కాపాడిన స్థానికులు

ఈ ప్రమాదం జరిగిన వెంటనే చిన్నారుల ఆర్తనాదాలు, కేకలు విన్న స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే అప్రమత్తమై, ప్రాణాలకు తెగించి నీటికుంటలోకి దూకారు. నీటిలోంచి ఒక చిన్నారిని బయటకు తీశారు. అయితే మిగిలిన ముగ్గురు చిన్నారుల ఆచూకీ కోసం స్థానికులు ఇంకా తీవ్రంగా శ్రమిస్తూ, రక్షించే ప్రయత్నాలను ముమ్మరం చేశారు.

పోలీసులు సైతం గాలింపు

మరోవైపు ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ముగ్గురు చిన్నారుల కోసం స్థానికులతో కలిసి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఆ ముగ్గురు పిల్లలు కూడా సురక్షితంగా, ప్రాణాపాయం నుంచి బయటపడాలని, తమ కళ్లెదుటే తిరుగాడిన ప్రాణాలు గండం నుంచి గట్టెక్కాలని స్థానికులు, గ్రామస్తులు దేవుడిని ప్రార్థిస్తున్నారు.

Next Story