వినుకొండ వైసీపీకి భారీ షాక్.. మాజీ ఎమ్మెల్యే మక్కెన గుడ్ బై

by Disha Web Desk 16 |
వినుకొండ వైసీపీకి భారీ షాక్.. మాజీ ఎమ్మెల్యే మక్కెన గుడ్ బై
X

దిశ, వెబ్ డెస్క్: అనుకున్నట్టుగానే వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు వైసీపీకి గుడ్ బై చెప్పనున్నారు. అనుచరులతో ఇవాళ ఆత్మీయ సమావేశం నిర్వహించిన ఆయన తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడబోతున్నట్లు ప్రకటించారు. భవిష్యత్ కార్యచరణ త్వరలో ప్రకటిస్తానని తెలిపారు. తాను పార్టీ వీడటంతో ఎవరూ అధైర్యపడవద్దని.. ఎప్పుడూ అండగా ఉంటానని మల్లికార్జున రావు భరోసా ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో తనకు సీటు దక్కుందని ఆయన భావించారు. అయితే సీటు కేటాయించడంలేదనే సంకేతాలు సీఎం జగన్ ఇచ్చారు. దీంతో మనస్థాపం చెందిన ఆయన పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు కొద్దిరోజులుగా నియోజకవర్గంలో వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఇటీవల విడుదలైన వైసీపీ ఆరో జాబితాలోనైనా తన సీటుపై స్పష్టత వస్తుందని భావించారు. కానీ తన పేరు రాకపోవడంతో ఇక పార్టీలో ఉండలేనని అనుకున్నారు. ఈ మేరకు కార్యకర్తల సమక్షంలోనే వైసీపీకి గుడ్ బై చెబుతున్నట్లు స్పష్టం చేశారు.

కాగా వినుకొండ ఎమ్మెల్యేగా బొల్లా బ్రహ్మనాయుడు పని చేస్తున్నారు. అయితే ఇంచార్జుల్లో భాగంగా ఈసారి తనకు సీటు వస్తుందని మక్కెన ఆశించారు. అయితే అధిష్టానం నుంచి సీటుపై స్పష్టత రాకపోవడంతో ఇటీవల ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మక్కెన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వినుకొండ నుంచి తానే పోటీ చేస్తానని చెప్పారు. కార్యకర్తలు, అభిమానులతో చర్చించి త్వరలో నిర్ణయం ప్రకటిస్తానని తెలిపారు. ఈ మేరకు ఆదివారం కార్యకర్తలతో సమావేశం నిర్వహించి తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించారు. దీంతో వినుకొండ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి.

Next Story

Most Viewed