రాజధానిపై మాజీ ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు

by Thanuru Gopichand |   (  Updated:2026-01-11 07:51:59  IST  )

ప్రజలంతా అన్నదమ్ముల లాగా కలిసిమెలిసి ఉండండి.

రాజధానిపై మాజీ ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్ : రాజధాని అమరావతి (Amaravati) విషయమై ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకుంది. అధికార, ప్రతిపక్ష నేతలు విమర్శలు ప్రతి విమర్శలతో రాజధాని విషయాన్ని రచ్చకీడుస్తున్నారు. ప్రజాధనం వృధా చేస్తున్నారని, మదర్ ఆఫ్ ఆల్ స్కాంస్ అంటే అమరావతి అని వైసీపీ ఆరోపణలను గుప్పిస్తుంటే.. మూడు రాజధానుల పేరుతో రాజధాని అభివృద్ధిని వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని.. జగన్ అసలు ఏపీలోనే ఉండరని.. బెంగళూరు నుంచే కార్యకలాపాలు నడిపిస్తారని.. అక్కడి నుంచి ఏపీపై కుట్రలు చేస్తున్నారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పెద్ద మనిషిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) స్పందించారు. వివాదాన్ని సద్దుమణిగేలా చేసేందుకు రంగంలోకి దిగారు. ఎత్తుకు పై ఎత్తులు, మాట పట్టింపులు, వివాదాలకు ఆస్కారం లేకుండా అందరూ కలిసి రాజధాని నిర్మాణానికి సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ విషయమై మాజీ ఉపరాష్ట్రపతి ఆదివారం మాట్లాడుతూ కేంద్రం, రాష్ట్రంతో పాటు అందరం కలిసి రాజధానిగా అమరావతిని ఏర్పాటు చేసుకున్నాం అన్నారు. అమరావతి అంటే గుంటూరు, గన్నవరం, విజయవాడ, తాడికొండలు మాత్రమే కాదని ఆంధ్రుల ఆకాంక్షకు ప్రతిరూపమని పేర్కొన్నారు. రాజధాని అంటే ఇలా ఉండాలి అనేలా అమరావతి రూపుదిద్దుకుంటుందన్నారు. భవిష్యత్తులో పూర్తిగా అభివృద్ది చెందిన అంతర్జాతీయ స్థాయిలో పేరు పొందుతుందని ఆశా భావం వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణం విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు చర్యలకు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తోందని స్పష్టం చేశారు. అధికారపక్షం, ప్రతిపక్షం అనే బేధం లేకుండా అందరూ కలిసి అమరావతిని అద్భుతంగా తయారు చేస్తారనే నమ్మకం తనకుందన్నారు. ఈ విషయంలో అనవసర వివాదాలను సృష్టించొద్దని కోరారు. అమరావతి అన్ని ప్రాంతాలకు మధ్యలో ఉందన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు నెలకొన్న నేపథ్యంలో.. ప్రజలంతా వైషమ్యాలకు దూరంగా ఉండాలని కోరారు. హైదరాబాద్ తరహాలోనే అమరావతిని కూడా అభివృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చారు.

Read More..

జగన్ అవగాహన రాహిత్యానికి ఈ ఒక్కమాటే నిదర్శనం : టీడీపీ నేత యనమల

Next Story