Ap News: జనసేనలో చేరిన కీలక నేత.. ఆహ్వానించిన పవన్

by Disha Web Desk 16 |
Ap News: జనసేనలో చేరిన కీలక నేత.. ఆహ్వానించిన పవన్
X

దిశ, డైనమిక్ బ్యూరో: మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు జనసేన పార్టీలో చేరారు. ఇటీవలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన టీవీ రామారావు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. జనసేన పార్టీ సిద్ధాంతాలు నమ్మి తాను పార్టీలో చేరుతున్నట్లు వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో జనసేన గెలుపుకోసం అహర్నిశలు శ్రమిస్తానని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్‌లో కొందరికే పదవులు వస్తున్నాయన్నారు. పార్టీని నమ్ముకున్న వాళ్లకు న్యాయం జరగడం లేదని ఆరోపించారు. వైసీపీ న్యాయం చేస్తానని చెప్పి తీరని అన్యాయం చేసిందని కనీసం తన కార్యకర్తలకు కూడా ఏమీ చేసుకోలేని పరిస్థితి నెలకొందని టీవీ రామారావు ఆవేదన వ్యక్తం చేశారు. కార్యకర్తల నిర్ణయం మేరకు జనసేన పార్టీలో చేరినట్లు ప్రకటించారు.

రాజకీయ నేపథ్యం

ఇకపోతే టీవీ రామారావు 2009 ఎన్నికల్లో కొవ్వూరు నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేసి గెలుపొందారు. అయితే తన సొంత నర్సింగ్ కాలేజీ విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో టీవీ రామారావు జైలుకు సైతం వెళ్లొచ్చారు. అనంతరం టీడీపీ ప్రభుత్వం హయాంలో ఆ కేసులు తప్పుడు కేసులని నిర్ధారణకు రావడంతో క్లీన్ చిట్ వచ్చేసింది. 2014లో ఆయనకు టీడీపీ టికెట్ దక్కలేదు. అయినప్పటికీ పార్టీ అభ్యర్థి కేఎస్ జవహర్‌ గెలుపుకోసం శ్రమించారు. ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారు.

వైసీపీలో చేరిన టీవీ రామారావు

అయితే మంత్రి కేఎస్ జవహర్‌కు నియోజకవర్గంలో ఎదురుగాలి వీయడంతో 2019లో తనకే టికెట్ దక్కుతుందని ఆశించి భంగపడ్డారు. నాన్ లోకల్ అయిన వంగలపూడి అనితకు టికెట్ ఇచ్చారు. దీంతో టీవీ రామారావు టీడీపీకి గుడ్ బై చెప్పేసి వైసీపీలో చేరారు. కొవ్వూరు నుంచి పోటీ చేసిన తానేటి వనిత గెలుపులో కీలక పాత్ర పోషించారు. అయితే పార్టీలో నెలకొన్న అసమ్మతి నేపథ్యంలో టీవీ రామారావు పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఆదివారం జనసేన పార్టీలో చేరారు. కొవ్వూరులో జనసేన పార్టీ అభ్యర్థిగా టీవీ రామారావు పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.


Next Story

Most Viewed