Breaking: సీబీఐ ఆఫీసు నుంచి వెళ్లిపోయిన అవినాశ్‌రెడ్డి.. రేపు విచారణ

by Disha Web Desk 16 |
Breaking: సీబీఐ ఆఫీసు నుంచి వెళ్లిపోయిన అవినాశ్‌రెడ్డి.. రేపు విచారణ
X

దిశ, వెబ్ డెస్క్: మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాశ్ రెడ్డి సీబీఐ ఎదుట విచారణకు హాజరయ్యే విషయంలో చాలా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సీబీఐ ఇచ్చిన నోటీసుల ప్రకారం ఎంపీ అవినాశ్ రెడ్డి కొద్దిసేపటిక్రితం సీబీఐ విచారణకు హాజరుకావాల్సి ఉంది. అయితే మధ్యంతర బెయిల్ కోరుతూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో సీబీఐ విచారణ సాయంత్రం 5 గంటలకు పొడిగించారు. అయినప్పటికీ ఎంపీ అవినాశ్ రెడ్డి సీబీఐ కార్యాలయానికి వెళ్లారు. అయితే సీబీఐ అధికారులు మంగళవారం ఉదయం 10:30 గంటలకు సీబీఐ విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. దీంతో ఎంపీ అవినాశ్ రెడ్డి సీబీఐ కార్యాలయం నుంచి వెనుదిరిగారు.

ఎంపీ అవినాశ్‌రెడ్డి హై కోర్టులో బెయిల్ పిటిషన్

కాగా వివేకానందరెడ్డి హత్యకేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి మధ్యంతర బెయిల్ పిటిషన్‌ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఆదివారం తన తండ్రిని అరెస్ట్ చేయడం అంతకుముందు ప్రధాన అనుచరుడు ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసిన నేపథ్యంలో అవినాశ్ రెడ్డి అరెస్ట్ తథ్యమంటూ వార్తలు హల్‌చల్ చేశాయి. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోరుతూ తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ బెయిల్ పిటిషన్‌పై వైఎస్ వివేకానందరెడ్డి తనయ వైఎస్ సునీతారెడ్డి ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. తమ వాదనలు కూడా వినాలని తెలంగాణ హైకోర్టును కోరారు. మధ్యంతర బెయిల్ పిటిషన్‌లో ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి చేసిన ఆరోపణలపై తమ వాదనలు వినాలని కోరింది.

వివేకా అల్లుడిపై అవినాశ్ సంచలన ఆరోపణలు

అయితే ఎంపీ అవినాశ్ రెడ్డి వివేకా హత్య కేసులో అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. తనకంటే ముందే వైఎస్ వివేకా హత్య గురించి రాజశేఖర్ రెడ్డికి తెలుసునని అలాగే ఆరోజు వైఎస్ వివేకా రాసిన లేఖను రాజశేఖర్ రెడ్డి మాయం చేశారని ...స్టాంప్ పేపర్లను కూడా మాయం చేశారని ఆరోపించారు. అంతేకాదు తెలుగుదేశం పార్టీ నేతలతో కలిసి సునీతారెడ్డి తమ కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేయాలని అకారణంగా తమపై ఆరోపణలు చేస్తుందని ఆరోపించారు.

వివేకా రెండో భార్య ప్రస్తానన

అలాగే వైఎస్ వివేకా రెండో భార్య అంశాన్ని కూడా అవినాశ్ రెడ్డి ప్రస్తావించారు. వివేకా హత్య కేసులో ఏ2గా ఉన్న సునీల్ యాదవ్ తల్లితోపాటు ఏ3 ఉమా శంకర్ రెడ్డి భార్యతో కూడా వైఎస్ వివేకానందరెడ్డికి అక్రమ సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. వారి భర్తలు లేనప్పుడు వివేకానందరెడ్డి వాళ్ల నివాసాలకు వెళ్లేవారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణల విషయంలో తమ వాదనలు కూడా వినాలని వైఎస్ సునీతారెడ్డి కోర్టును కోరారు. అయితే అవినాశ్ రెడ్డి మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై సాయంత్రం 5 గంటలకు హైకోర్టు విచారించనుంది.

Next Story

Most Viewed