రాష్ట్రంలో భానుడి భగభగలు... ఐదు రోజుల పాటు జాగ్రత్త..!

by Vemula.Srinu Prasad |

తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. వచ్చే వారం రోజులపాటు భానుడు తన ప్రతాపం చూపించనున్నాడని, ఎండల తీవ్రతతో పాటు వడగాలులు బలంగా వీచే అవకాశం ఉందని తెలిపింది. ...

రాష్ట్రంలో భానుడి భగభగలు... ఐదు రోజుల పాటు జాగ్రత్త..!
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. వచ్చే వారం రోజులపాటు భానుడు తన ప్రతాపం చూపించనున్నాడని, ఎండల తీవ్రతతో పాటు వడగాలులు బలంగా వీచే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా ఈ నెల 19 నుంచి 24 వరకు ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదయ్యే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేశారు. ఈ ఆరు రోజుల కాలంలో సగటు ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల మార్కును దాటిపోతాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.

పలు కీలక సూచనలు

తీవ్రమవుతున్న ఎండల నేపథ్యంలో నిపుణులు, వైద్యులు పలు కీలక సూచనలు చేశారు. ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 4:00 గంటల మధ్య కాలంలో ఎండ తీవ్రత గరిష్ఠంగా ఉంటుందని, ఆ సమయంలో అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని హెచ్చరించారు. ఈ సీజన్‌లో వీచే వడగాల్పుల వల్ల వడదెబ్బ తగిలి ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని, ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు తెలిపారు. ప్రయాణాలు చేసేటప్పుడు, బయటకు వెళ్లేటప్పుడు వెంట తప్పనిసరిగా తాగునీరు ఉంచుకోవాలని సూచించారు. కాటన్ దుస్తులు ధరించడం, కొబ్బరిబొండాలు, మజ్జిగ, ఓఆర్ఎస్ వంటివి ఎక్కువగా తీసుకోవడం ద్వారా శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉంటుందని చెప్పారు. వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు ఈ వారం రోజులపాటు ఎండకు దూరంగా, సురక్షితమైన ప్రదేశాల్లో ఉండాలని వైద్యులు సూచించారు.

Next Story