రైతులు వ్యాపారులుగా మారాలి : మాజీ ఉపరాష్ట్రపతి

by Thanuru Gopichand |

ఆధునిక సాంకేతికతను.. అవకాశాలను అందిపుచ్చుకోవడంలో ముందుండాలి.

రైతులు వ్యాపారులుగా మారాలి : మాజీ ఉపరాష్ట్రపతి
X

దిశ, వెబ్ డెస్క్ : వ్యవసాయం చేస్తున్నాం.. పంట పండిస్తున్నాం అన్నంత వరకే కాదు.. రైతులు వ్యాపారులుగా మారాలని భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు (M Venkaiah Naidu) రైతులకు పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లాలోని వట్టిచెరుకూరులో సోమవారం జరిగిన రైతు నేస్తం ఫౌండేషన్ (Rythu Nestam Foundation) దశమ వార్షికోత్సవానికి ఆయన ముఖ్య ఆహ్వానితులుగా హాజరయ్యారు. గత పది సంవత్సరాలుగా ఫౌండేషన్ ను విజయవంతంగా నిర్వహిస్తున్న యడ్లపల్లి వెంకటేశ్వర రావుకు, కార్యక్రమానికి విచ్చేసిన అన్నదాతలకు శుభాకాంక్షలను తెలియజేశారు.

ఈ సందర్భంగా మాజీ ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ ఇదే వేదిక నుంచి ఔషధ మొక్కలను కూడా పంపిణీ చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇక్కడి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి, వారు అనుసరిస్తున్న సంప్రదాయ ప్రకృతిసేద్యం పద్ధతులను తెలుసుకుని ఆనందించానని పేర్కొన్నారు. సంప్రదాయ వ్యవసాయ పద్ధతులను ఆధునిక మార్గంలో రైతుల వద్దకు చేర్చి అవగాహన కల్పించడంతో పాటు, ఏటా రైతునేస్తం అవార్డులతో ప్రొత్సహిస్తున్న వెంకటేశ్వరరావు అభినందనీయులు అన్నారు.

2023ను ప్రపంచం సిరిధాన్యాల (Millets) ఏడాదిగా గుర్తించిందని గుర్తు చేశారు. అంతకు ముందు నుంచే రైతు నేస్తం, సిరిధాన్యాల పట్ల అవగాహన కల్పించేందుకు చేసిన కృషి ఈ సందర్భంగా ప్రస్తావనీయమైనదని అన్నారు. వ్యవసాయం చేస్తున్నాం, పండిస్తున్నాం అన్నంత వరకే కాదు, రైతులుగా వ్యాపారులుగా మారాలని స్పష్టం చేశారు. తమ పంటకు సరైన గిట్టుబాటు ధర వచ్చే విధంగా ఆధునిక విధానాలను అందిపుచ్చుకోవాలని రైతులను కోరారు.

రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు భారత ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ఈ సందర్భంగా తెలుసుకోవలసిన అవసరం ఎంతో ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం సిరిధాన్యాలతో పాటు... ప్రకృతి సేద్యం ద్వారా పండించిన పంటలకు ఎంత డిమాండ్ ఉందో రైతులకు తెలిసిందేనన్నారు. ఈ అవకాశాలను అందిపుచ్చుకోవాలని.. ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలని.. అధిక లాభాలను సముపార్జించాలని రైతులను కోరారు.

Next Story