జైలుకెళ్లొచ్చినా తగ్గేదేలే అంటున్న పట్టాభి.. రిటర్న్ గిఫ్ట్ పక్కా అంటూ వార్నింగ్

by Disha Web Desk 16 |
జైలుకెళ్లొచ్చినా తగ్గేదేలే అంటున్న పట్టాభి.. రిటర్న్ గిఫ్ట్ పక్కా అంటూ వార్నింగ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తోట్ల వల్లూరు పోలీస్ స్టేషన్‌లో తనను గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు చిత్రహింసలకు గురి చేశారని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి సంచలన ఆరోపణలు చేశారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన పట్టాభి మీడియాతో మాట్లాడారు. పోలీస్ స్టేషన్‌లో ముసుగు వేసుకున్న ముగ్గురు వ్యక్తులు తనను హింసించారని వాపోయారు. అర్ధరాత్రి నుంచి తెల్లవారు జాము వరకు తీవ్రంగా వేధించారన్నారు. టవల్ బిగించి ఊపిరాడకుండా చేశారన్నారు. ఇవన్నీ చూస్తుంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎలా ఖూనీ అవుతుందో తెలుస్తుందని మండిపడ్డారు. పోలీస్ స్టేషన్లలో సామాన్యుడికి న్యాయం జరగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం బెదిరింపులకు బెదిరిపోయేది లేదని, అదిరిపోయేది లేదని, భయపడేది లేదని పట్టాభి పేర్కొన్నారు.

గుణపాఠం తప్పదు

గన్నవరం నియోజకవర్గంలో బీసీ నేత దొంతు చిన్నాపై జరిగిన దాడికి సంబంధించి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్తే తనపై దాడి చేశారని పట్టాభి ఆరోపించారు. బలహీన వర్గానికి చెందిన వ్యక్తిపై దాడి చేస్తుంటే అడ్డుకోవడం నేరమా అని ప్రశ్నించారు. బలహీన వర్గాల వ్యక్తికి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోవాలనే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. బలహీన వర్గాలకు అన్యాయం జరిగితే టీడీపీ పోరాటం చేస్తుందని, అందులో ఎలాంటి సందేహం లేదన్నారు. అండగా నిలిచేందుకు వెళ్లిన తనపై 307 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారని స్పష్టం చేశారు. తోట్లవల్లూరు స్టేషన్‌లో ముగ్గురు వ్యక్తులు చిత్రహింసలకు గురి చేసినట్లు ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వారందరికీ తగిన గుణపాఠం చెబుతామని పట్టాభి హెచ్చరించారు. ఇప్పటి వరకు తనపై నాలుగుసార్లు దాడి జరిగిందని, అయినా వెనకడుగువేసే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ముందుకు వెళ్తామని పట్టాభి స్పష్టం చేశారు.


Next Story

Most Viewed