ఆస్తి రాయించుకుని పట్టించుకోని కుమార్తె.. కలెక్టర్‌కు తల్లిదండ్రులు ఫిర్యాదు

by Vemula.Srinu Prasad |

ఆస్తి రాయించుకుని పట్టించుకోని కుమార్తెపై కలెక్టర్‌కు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు..

ఆస్తి రాయించుకుని పట్టించుకోని కుమార్తె.. కలెక్టర్‌కు తల్లిదండ్రులు ఫిర్యాదు
X

దిశ, అమ‌లాపురం: వృద్ధ దంప‌తుల‌కు పెంపుడు కుమార్తె బిగ్ షాక్ ఇచ్చింది. రెండెక‌రాల‌కు పైబ‌డి స్థిరాస్థిని త‌న పేరున రాయించుకుని మోహం చాటేసింది.. ఇప్ప‌డు ఉన్న ఇంటిని సైతం త‌న‌పేరుపై రాసివ్వాల‌ని ప‌ట్టుబ‌ట్టింది.. దీంతో త‌మ కుమార్తెకు రాసిచ్చిన భూమిని వెన‌క్కి ఇప్పించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్‌ను వృద్ధదంపతులు ఆశ్ర‌యించారు.

అల్ల‌వ‌రం మండ‌లం మొగ‌ళ్ల‌మూరుకు చెందిన వాస‌ర్ల వెంక‌ట‌న‌ర్స‌య్య‌, ల‌క్ష్మి దంప‌తులు అండ‌మాన్‌లో టైల‌రింగ్ ప‌నిచేసుకుంటూ రెండు ఎక‌రాల 18 సెంట్లు కూడ‌బెట్టారు. పిల్ల‌లు లేని లోటు పూడ్చుకునేందుకు బంధువుల ఇంట్లోని ఆడ‌పిల్ల‌ను పెంచి పెద్ద‌చేశారు. ఆమెకు అన్ని లాంఛ‌నాల‌తో వివాహం కూడా జ‌రిపించారు. ఈక్ర‌మంలోనే తండ్రి వెంక‌ట‌న‌ర్స‌య్య పేరు మీద ఉన్న 2.18 ఎక‌రాల భూమిని త‌న పేరున రాసివ్వాల‌ని పెంచిన కుమార్తె వాసంశెట్టి జ్యోతి అడ‌గ‌డంతో ప్రేమ‌తో ఆమె పేరుమీద రాసిచ్చారు. ఆ త‌రువాత తల్లిదండ్రులు ఉంటున్న ఇంటిని కూడా త‌న పేరుమీద రాసివ్వాల‌ని కోరినట్లు తెలిపారు.

ఇదిలా ఉండ‌గా అండ‌మాన్‌లో లీజు ప్రాతిప‌దిక‌న త‌మ పేరు మీద ఉన్న షాపుల‌ను కుమార్తె జ్యోతి, ఆమె భ‌ర్త వీర‌వెంక‌ట‌ స‌త్య‌నారాయ‌ణ‌ స్వాధీనం చేసుకుని దాని ద్వారా వ‌చ్చే అద్దెల‌ను కూడా వారే తీసుకుంటున్నార‌ని, దీంతో తాము బతికేందుకు చాలా ఇబ్బందులు ప‌డాల్సిన ప‌రిస్థితి తెల‌త్తింద‌ని వెంక‌ట న‌ర్స‌య్య‌, ల‌క్ష్మి దంప‌తులు వాపోయారు. త‌మ కుమార్తె చాలా కాలంగా తమను చూడ‌డం లేద‌ని, వృద్ధాప్యంలో అనారోగ్యం పాలైనా ఆస్తులు రాయించుకునేందుకు చూస్తుంది కానీ క‌నీసం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని క‌న్నీరు మున్నీర‌య్యారు. త‌మ ఖాతాల్లో ఉన్న డ‌బ్బులు సైతం త‌మ‌కు తెలియ‌కుండా కాజేశార‌ని, ప్ర‌స్తుతం బత‌క‌డానికి తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నామ‌ని అధికారుల‌కు తెలిపారు.

త‌మ వృద్ధాప్యంలో చూస్తుంద‌న్న‌న‌మ్మ‌కంతో ఉన్న ఆస్తిని అంత‌టినీ పెంచిన కుమార్తె వాసంశెట్టి జ్యోతి పేరున రాసిచ్చామ‌ని ఇప్ప‌డు త‌మ‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని వాపోయారు. ఈనేప‌థ్యంలోనే త‌మ కుమార్తె పేరు మీద రాసిన దాన సెటిల్మెంట్ రిజిస్ట్రేష‌న్‌ను ర‌ద్దుచేసి త‌మ పేరున తిరిగిరాయించాల‌ని వారు జిల్లా క‌లెక్ట‌ర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేర‌కు సోమ‌వారం జిల్లా క‌లెక్ట‌రేట్‌లో నిర్వ‌హించే గ్రీవెన్స్‌లో ఫిర్యాదుచేశారు.

Next Story