ఇసుక అక్రమ తరలింపు.. లంక భూములు నదీ గర్భంలో కలిసిపోతాయని ఆందోళన

by Jakkula Mamatha |
ఇసుక అక్రమ తరలింపు.. లంక భూములు నదీ గర్భంలో కలిసిపోతాయని ఆందోళన
X

దిశ, ప్రతినిధి: అయినవిల్లి మండలంలో ప్రభుత్వం అవలంబిస్తున్న ఇసుక పాలసీని కొందరు అక్రమార్కులు బరితెగిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించి ఖనిజ సంపదను అక్రమంగా తరలిస్తున్నారు. అక్రమార్జనే పరమావధిగా నిబంధనలకు విరుద్ధంగా అక్రమాలకు తెగబడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. అయినవిల్లి మండలం ముక్తేశ్వరం రేవులో మాన్సస్ ట్రస్ట్ భూములున్నాయి. గోదావరి మధ్యలో ఇసుక మేటలు మేటవేసి ఉంది. కొందరు అక్రమార్కులకు ఇసుక, బొండు మట్టిపై దృష్టి పడింది. దీంతో కొందరు నాయకులను అధికారులను, కొందరు మీడియా వారిని అక్రమార్కులు కట్టడి చేసి ముట్టచెప్పుకున్నట్లు సమాచారం. లంకలు మధ్యలో కార్యాలయం నిర్మించి సీసీ.కెమెరాలు ఏర్పాటు చేశారు.

ప్రోక్లైనర్ లను వినియోగించి పదుల సంఖ్యలో టిప్పర్ లారీలను ఉపయోగించి రాత్రింబవళ్లు వందలాదిగా లారీల సామర్థ్యానికి మించి తరలిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. అధికారిక లెక్కల ప్రకారం గోదావరి జిల్లాలలో మాన్సాస్ ట్రస్ట్ కు 14800 ఎకరాలు భూములు ఉన్నాయి. స్థానికంగా కోటిపల్లి, వీరవల్లిపాలెం, అయినవిల్లి లంక, అద్దంకి వారి లంక, పొట్టిలంక ,కొండుకుదురు లంక తదితర గ్రామాల రైతులు కూరగాయలు, మొక్కజొన్న, మునగ, పుచ్చకాయ, దోసకాయలు, బొప్పాయి పంటలకు సారవంతమైన అనువైన వాతావరణం కలిగి ఉండడంతో అధిక దిగుబడినిచ్చే పంటలు రైతులు సాగు చేసుకుంటున్నారు.

వీటి ద్వారా రైతులు తమ జీవన భృతిని కొనసాగిస్తున్నారు. కోటిపల్లిలోని బొండు మట్టి ని ప్రాక్లేనర్, టిప్పర్ లారీలను వినియోగించి ఇక్కడున్న ఖనిజ సంపదను దోచుకు పోవడం వల్ల భూగర్భ జలాలు అడుగంటడంతో పాటు వరదల సమయంలో నదీ పరివాహక ప్రాంతంలోని గ్రామాలతోపాటు ఫల సాయంతో ఉన్న భూభాగం మొత్తం గోదావరిలో కలిసిపోతాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే కొనసాగితే తమ జీవనాధారం ప్రశ్నార్ధకంగా మారే ప్రమాదం ఉందని, లంక పొలాలు నదీ గర్భంలో కలిసి పోయే ప్రమాదం ఉందని, ఇప్పటికే ప్రభుత్వాలను లంక భవన్ రక్షించే విధంగా గ్రోయన్స్ నిర్మాణాలను చేపట్టాలని, కోరుతున్నామని రైతులు ఆందోళన చెందుతున్నారు. కోనసీమ కల కోటిపల్లి - నరసాపురం రైల్వే లైన్ కి సంబంధించి కోటిపల్లి బ్రిడ్జ్ కు పిల్లర్లను సిద్ధం చేశారు.

వాటికి సమీపంలోని ఇసుకను లోతుకు తీసివేయడం తో వరదల సమయంలో ప్రవాహానికి బ్రిడ్జి సైతం కుంగిపోయే ప్రమాదం ఉందని కొందరు నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ అక్రమ ఇసుక తరలింపు చూస్తూ కాసుల మత్తులో మునిగి ప్రేక్షక పాత్ర పోషిస్తున్న మైనింగ్, పొల్యూషన్, రెవెన్యూ, పోలీస్, రోడ్డు ట్రాన్స్పోర్ట్ తదితర శాఖల అధికారులు మౌనం వహించడం పట్ల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ దృష్టి సారించి నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

కోటిపల్లి నుంచి అయినవిల్లి మీదుగా అక్రమ ఇసుక తరలింపు రోజుకు సుమారు వంద లారీలు ఇసుక బండ్లు మట్టి విక్రయాలు జరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు . మే ఒకటో తేదీ నుంచి ఇసుక తవ్వకాలు అమల్లోకి వస్తాయని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఆదేశాలు జారీ చేసినప్పటికీ అధికారులు ,అక్రమార్కులు పట్టించుకోవడం లేదని, అధికారులు సమన్వయ లోపంతో పనిచేస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. కావున జిల్లా అధికార యంత్రాంగం దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని లంక ప్రజలు కోరుతున్నారు.



Next Story

Most Viewed