- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AP News: వాతావరణ మార్పులు తీర ప్రాంతాలకు ముప్పు..!
వాతావరణంలో వస్తున్న మార్పులతో సముద్ర మట్టం పెరుగుతుందని, తద్వారా తీర ప్రాంతాలు ముంపుకు గురయ్యే ప్రమాదం ఉందని పి.ఆర్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ డా. బి.వి. తిరుపాణ్యం పేర్కొన్నారు.

దిశ,కాకినాడ: వాతావరణంలో వస్తున్న మార్పులతో సముద్ర మట్టం పెరుగుతుందని, తద్వారా తీర ప్రాంతాలు ముంపుకు గురయ్యే ప్రమాదం ఉందని పి.ఆర్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ డా. బి.వి. తిరుపాణ్యం పేర్కొన్నారు. కాకినాడ పి.ఆర్. కళాశాలలో గురువారం రేడియో అల 90.8 ఎఫ్.ఎం ఆధ్వర్యంలో ప్రపంచ రేడియో దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రేడియో అల 90.8 ఎఫ్.ఎం, కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ జర్నలిజం, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ సంయుక్త ఆధ్వర్యంలో రేడియో - వాతావరణ మార్పు అనే అంశంపై సదస్సు జరిగింది. సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ తిరుపాణ్యం మాట్లాడుతూ వాతావరణం వేడెక్కడం కారణంగా మంచు కొండలు కరిగి సముద్ర మట్టాలు పెరగడం తీర ప్రాంతాలకు పెనుముప్పు ను కలిగించే ప్రమాదం ఉందన్నారు. వాతావరణ మార్పులను నియంత్రించడానికి చేపట్టాల్సిన జాగ్రత్తలను డా. తిరుపాణ్యం వివరించారు.
ఆలివ్ రిడ్లే తాబేళ్ళు సంతానోత్పత్తి కాలంలో తీర ప్రాంతం నుంచి ఐదు కిలోమీటర్ల మేర చేపల వేట చెయ్యరాదనే నిబంధన ఉన్నప్పటికి మత్స్య కారులు నిబంధనలు పాటించకపోవడం వలన తాబేళ్ళు మృత్యువాత పడుతున్నాయని అన్నారు. జీవ వైవిధ్యం దెబ్బతింటుందని కోరింగ్ వైల్డ్ లైఫ్ సాంక్చరీ బీట్ ఆఫీసర్ కె.మహేష్ ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడ నగర వాసులకు ప్రకృతి ప్రసాదించిన వరం హోప్ ఐలాండ్, కోరింగ మడ అడవులన్నారు. రెండు సహజ సిద్ధంగా ఏర్పడి సముద్ర ముప్పు నుంచి కాకినాడ తీర ప్రాంతానికి రక్షణ కవచంగా ఉన్నాయన్నారు. రేడియో అల 90.8 ఎఫ్.ఎం స్టేషన్ డైరెక్టర్ ఎం.సత్య మాట్లాడుతూ సూర్య కిరణాలు, గాలి, మరియు జీవ వాయు వంటి పునరుత్పత్తి శక్తులపై ఆధారపడడం ద్వారా వాయు కాలుష్యాన్ని తగ్గించవచ్చన్నారు.
సౌర విద్యుత్ ను తయారు చెయ్యడం ద్వారా బొగ్గు, ఆయిల్, నీటి వినియోగాన్ని తగ్గించడం ద్వారా కర్బన ఉద్గారాలను తగ్గించవచ్చని తెలిపారు. బర్డ్ కన్జర్వేషనిస్ట్ కె.మృత్యుంజయరావు మాట్లాడుతూ.. సాంప్రదాయేతర ఇంధన వనరుల పేరిట స్థాపిస్తున్న పరిశ్రమల వలన అరుదైన కొన్ని పక్షిజాతులకు ఆవకాశాలు లేక అంతరించిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాలలో మలిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ ఎం.వి.ఆర్.ఫణీంద్ర, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ డాక్టర్ సోమరాజు, డిపార్ట్మెంట్ ఆఫ్ జర్నలిజం డాక్టర్ శ్రీనివాస రావు, లెక్చరర్లు సి.హెచ్.వెన్నెల, రక్షారాజ్, పుష్పలత, ప్రతిబా గ్రేస్, సౌజన్య, శ్వేత, సామాజిక కార్యకర్త అల్లూరి సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.






