Kakinada: బీసీల ఐక్య వేదికలో అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 16 |
Kakinada: బీసీల ఐక్య వేదికలో అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
X

దిశ (ఉభయ గోదావరి ప్రతినిధి): ముఖ్యమంత్రి జగన్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని, ప్రజలకు స్వేచ్ఛ లేకుండా పోయిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. కాకినాడ సూర్య కళామందిరంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీసీల ఐక్య వేదిక అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అచ్చెన్నాయుడు, మాజీ మంత్రులు అయ్యన్న పాత్రుడు, కొల్లు రవీంద్ర, యనమల రామకృష్ణుడు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీల హక్కు కాల రాస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు అవసరం లేని పథకాలను సీఎం జగన్ ప్రవేశ పెట్టారని చెప్పారు. మైనార్టీలకు, బీసీలకు, ఎస్సీ, ఎస్టీలకు, ఇతర ఉప కులాలకు ఆయన ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కార్పొరేషన్లు ఇచ్చామని చెప్పుకొంటున్న జగన్ వాటికి నిధులు ఇచ్చారా? అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. బీసీలు ఉపాధి పొందడానికి ఏదైనా రాయితీ పొందాలంటే ఒక్కరూపాయి కూడా ఇవ్వడంలేదన్నారు. రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాల్లో పేదరికం బాగా పెరిగిపోతుందన్నారు. విద్యావంతులు ఉపాధి లేక చాలా అవస్థలు పడుతున్నారని తెలిపారు. కార్పొరేషన్లకు ఛైర్మన్‌లుగా ఇచ్చి వారికి కనీస అధికారాలు కూడా ఇవ్వకుండా అవమానం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్‌కు త్వరలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు బుద్ధి చెబుతారని అన్నారు.



Next Story

Most Viewed