అక్టోబర్ 15 నుంచి దసరా మహోత్సవాలు : దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు

by Disha Web Desk 21 |
అక్టోబర్ 15 నుంచి దసరా మహోత్సవాలు : దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఇంద్రకీలాద్రి పై దసరా శరన్నవరాత్రులకు సర్వం సిద్ధం చేసినట్లు ఇంద్రకీలాద్రి దుర్గగుడి పాలక మండలి చైర్మన్ కర్నాటి రాంబాబు తెలిపారు. విజయవాడలో దుర్గగుడిలో మంగళవారం చైర్మన్ కర్నాటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ...శరన్నవరాత్రి మహోత్సవాల షెడ్యూల్ విడుదల చేశారు. ఇంద్రకీలాద్రి పై అక్టోబర్ 15 నుంచి 23 తేదీ వరకు దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు నిర్వహించబోతున్నట్లు తెలిపారు. అక్టోబర్‌ 15న ఉత్సవాల తొలిరోజు శ్రీ బాల త్రిపుర సుందరీ దేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనమివ్వనున్నారని తెలిపారు. అనంతరం 16న శ్రీ గాయత్రీ దేవి అలంకారం, 17 న శ్రీ అన్నపూర్ణా దేవి అలంకారం, 18 న శ్రీ మహాలక్ష్మి దేవి అలంకారం, 19న శ్రీ మహాచండీ దేవి అలంకారం, 20 న శ్రీ సరస్వతీ దేవి అలంకారం (మూలానక్షత్రం)లో అమ్మవారు దర్శనం ఇస్తారని తెలిపారు. అక్టోబర్ 20న మధ్యాహ్నం 3గంటల నుంచీ 4 గంటల మధ్యలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు అని కర్నాటి రాంబాబు తెలిపారు. అక్టోబర్ 21 న శ్రీ లలితా త్రిపురసుందరీ అలంకారం, 22న శ్రీ దుర్గాదేవి అలంకారం, 23న శ్రీ మహిషాసుర‌మర్ధనీ దేవిఅలంకారం... మధ్యాహ్నం నుంచీ శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకారంలో అమ్మవారు దర్శనం ఇవ్వబోతున్నట్లు దుర్గగుడి పాలక మండలి చైర్మన్ కర్నాటి రాంబాబు తెలిపారు.

దుర్గాఘాట్ వైపు క్యూ లైన్లు: కర్నాటి

దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు సంబంధించి అధికారులు, పాలక మండలి అన్ని ఏర్పాట్లు చేస్తోందని వెల్లడించారు. అమ్మవారి గుడిలో ఇంజనీరింగ్ వర్క్స్‌కు రూ.2.5 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. పలు దేవాలయాల నుంచీ సిబ్బందిని తీసుకొచ్చి దసరాకు వినియోగిస్తాం అని తెలిపారు. పది రోజులకు కాంట్రాక్టు పద్ధతిలో కొంతమంది సిబ్బందిని ఏర్పాటు చేస్తామని అన్నారు. అన్నదాన భవనం కూడా త్వరలో పూర్తి చేస్తాం అని తెలిపారు. అంతేకాదు 200 మంది ఇతర దేవాలయాల నుంచి సిబ్బంది వస్తారు అని చెప్పుకొచ్చారు. అన్ని శాఖల అధికారులు భక్తులకు అసౌకర్యం కలుగకుండా చూస్తారు అని చెప్పుకొచ్చారు. కొండచరియలు జారిపడిన కారణంగా క్యూలైన్లు దుర్గాఘాట్ వైపు మార్చడం జరుగుతుంది అని తెలిపారు.

జల్లు స్నానాలకు షవర్ లు ఏర్పాటు: ఈఓ భ్రమరాంబ

వినాయకుడి గుడి వద్ద నుంచీ క్యూలైన్లు ప్రారంభం అవుతాయి అని ఈవో భ్రమరాంబ తెలిపారు. ఎప్పటిలాగే ఐదు క్యూలైన్లు ఉంటాయని చెప్పుకొచ్చారు. కేశఖండన శాలకు 600 మంది సిబ్బంది ఉంటారని...భక్తులు నిలిచే ప్రదేశాలను గుర్తించి షెడ్లు వేస్తున్నాం అని చెప్పుకొచ్చారు. జల్లు స్నానాలకు షవర్ లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. పది ప్రసాదం కౌంటర్లు ఉంటాయన్నారు. మోడల్ గెస్ట్ హౌస్, స్టేట్ గెస్ట్ హౌస్‌ల వద్ద కూడా ప్రసాదం కౌంటర్లు ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. వీవీఐపీల దర్శనం పై స్లాట్లు కూడా నిర్ణయిస్తాం అని తెలిపారు. దసరా 9 రోజులూ అంతరాలయ దర్శనం లేదు అని ఈవో భ్రమరాంబ తెలిపారు.

Next Story

Most Viewed