ఏపీలో క్వార్టర్​ రేటుపై.. డౌట్లు!

by Anil Sikha |
ఏపీలో క్వార్టర్​ రేటుపై.. డౌట్లు!
X

దిశ, డైనమిక్​బ్యూరో : ఏపీలో మద్యం ధరలపై మాటల యుద్ధం కొనసాగుతోంది. క్వార్టర్​బాటిల్​పై రూ.20 నుంచి రూ.30 వరకు పెంచారంటూ వైసీపీ ప్రచారం చేస్తోంది. మద్యం ప్రియులపై అదనపు భారాన్ని మోపుతున్నారని ఆరోపిస్తోంది. దీనిని కూటమి ప్రభుత్వం ఖండిస్తోంది. ఈ మేరకు ఇరు పార్టీలు తమ ట్విట్టర్​అకౌంట్లలో పోస్టర్లను విడుదల చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత సెప్టెంబరులో నూతన మద్యం పాలసీని అందుబాటులోకి తీసుకువచ్చింది. కొద్దిరోజులకే ఎన్నికల హామీలలో ప్రకటించిన విధంగా రూ.99 క్వార్టరు మద్యం , అన్ని ప్రీమియం బ్రాండ్లను అందుబాటులోకి తీసుకు వచ్చింది. తాజాగా రిటైల్​ విక్రయాలపై మార్జిన్​ను 14.5శాతం నుంచి 20 శాతానికి పెంచింది. దీంతో బాటిల్​పై రూ.10 పెరిగింది. ఇదే అదనుగా వైసీపీ .. కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు మొదలు పెట్టింది. అయితే రూ.99 బాటిల్​, బీర్ల ధరల్లో మార్పు లేదని ప్రభుత్వం ప్రకటించింది.

గత వైసీపీ హయాంలో జగన్ ​మద్యం పాలసీతో దోచుకున్నాడంటూ టీడీపీ ఓ పోస్టర్​ను విడుదల చేసింది. మద్యం దుకాణాల వైసీపీ తన వారికే కేటాయించారని, కానీ కూటమి ప్రభుత్వం లాటరీ ద్వారా మద్యం దుకాణాలు పారదర్శకంగా కేటాయించారని పేర్కొంది. మద్యం దరఖాస్తుల ద్వారానే కూటమి ప్రభుత్వానికి రూ.1800 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపింది. గీత కార్మికులకు తాము 340 దుకాణాలు కేటాయించామని దీనిపై వైసీపీ కోర్టుకు వెళ్లడం వారి చిత్తశుద్ధిని ప్రశ్నిందన్నారు. వైసీపీ హయాంలో క్వార్టరు ధర రూ.250కి పైగా ఉండగా.. ఇప్పుడు కేవలం రూ.99కే లభిస్తుందని పేర్కొంది. నాడు అన్నీ జే బ్రాండ్లు విక్రయించగా నేడు.. ప్రీమియం బ్రాండ్లను అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు తెలిపింది. దుకాణాల చెల్లింపుల్లో డిజిటల్​ విధానాన్ని కూడా అమలు చేస్తున్నట్లు పేర్కొంది. గతంలో వైసీపీ హయాంలో మద్యం తాగి చాలామంది అనారోగ్యం పాలయ్యారని ఆరోపించింది. మద్యం లైసెన్సుదారులకు కమీషన్​ పెంచడం ద్వారా భారీగా ముడుపులు వసూళ్లు చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. దీనిని మంత్రి కొల్లు రవీంద్ర కొట్టిపారేశారు. మద్యం కుంభకోణంలో వైసీపీ నేతల పేర్లు బయటకు వస్తాయనే భయంతోనే లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆయన చెబుతున్నారు. అస్యత ప్రచారాలను ఉపేక్షించబోమన్నారు



Next Story

Most Viewed