సింహాచలానికి ప్రారంభమైన డబుల్ డెక్కర్ బస్ సర్వీస్

by Thanuru Gopichand |

విశాఖపట్నం పర్యాటక రంగాన్ని (Visaka Tourism) మరింత పెంపొందించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది.

సింహాచలానికి ప్రారంభమైన డబుల్ డెక్కర్ బస్ సర్వీస్
X

దిశ, వెబ్ డెస్క్ : విశాఖపట్నం పర్యాటక రంగాన్ని (Visaka Tourism) మరింత పెంపొందించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. నగరంలో పర్యాటక ఆకర్షణగా ప్రవేశపెట్టిన డబుల్ డెక్కర్ ఎలక్ట్రిక్ బస్సు సర్వీసులను సింహాచలం దేవస్థానం (Simhachalam Temple) వరకు పొడిగించారు. పర్యాటకులు సాగర తీర అందాలను వీక్షించేందుకు ప్రవేశపెట్టిన ఈ బస్సులకు అనూహ్య స్పందన లభించడంతో, భక్తుల సౌకర్యార్థం, ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ఈ సేవలను మరింత విస్తరించారు. సుప్రసిద్ధ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానాన్ని సందర్శించాలనుకునే భక్తులకు ఈ డబుల్ డెక్కర్ బస్సు ప్రయాణం సరికొత్త అనుభూతిని ఇవ్వనుంది. గురువారం నుంచి సింహాచలానికి డెబుల్ డెక్కర్ సేవలను ప్రారంభించారు.

​ప్రస్తుతం బీచ్‌ రోడ్డులో ఆర్కే బీచ్ నుంచి తొట్లకొండ వరకు నడుస్తున్న ఈ హాప్-ఆన్-హాప్-ఆఫ్ (Hop-on Hop-off) సర్వీసులను సింహాచలం వరకు మళ్లించడం ద్వారా ఒకే టికెట్‌పై నగరంలోని ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలైన కైలాసగిరి, ఇందిరా గాంధీ జూ, రుషికొండ వంటి వాటితో పాటు పవిత్ర పుణ్యక్షేత్రాన్ని కూడా దర్శించుకునే అవకాశం లభిస్తుంది. పర్యావరణహితమైన ఈ ఎలక్ట్రిక్ బస్సులు పర్యాటకానికి ఎటువంటి ఆటంకం లేకుండా ఆహ్లాదకరమైన ప్రయాణాన్ని అందిస్తాయని అధికారులు పేర్కొంటున్నారు. పెద్దలకు సుమారు రూ. 250లు, పిల్లలకు రూ. 100లు టికెట్ ధరతో (జీఎస్టీ అదనం) 24 గంటల పాటు నగరంలో ఎక్కడైనా ఎక్కడానికి, దిగడానికి అవకాశం కల్పిస్తున్నాం అన్నారు. డబుల్ డెక్కర్ బస్సు పైనుంచి విశాఖ నగరం దృశ్యాలను వీక్షించడం పర్యాటకులకు మరపురాని జ్ఞాపకంగా నిలుస్తుందని తెలియజేశారు.

Next Story