మ‌ళ్లీ వ‌ర్షాలు అంటా..! మత్స్యకారులు సముద్ర వేటకు వెళ్లొద్దని హెచ్చరిక.. విపత్తుల నిర్వహణ సంస్థ అలర్ట్

by Ramesh Naini |

ఇటీవల మొంథా తుఫాను కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మ‌ళ్లీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అలర్ట్ ఇచ్చింది.

మ‌ళ్లీ వ‌ర్షాలు అంటా..! మత్స్యకారులు సముద్ర వేటకు వెళ్లొద్దని హెచ్చరిక.. విపత్తుల నిర్వహణ సంస్థ అలర్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇటీవల మొంథా తుఫాను కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మ‌ళ్లీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అలర్ట్ ఇచ్చింది. నైరుతి బంగాళాఖాతం-శ్రీలంక తీరాల వద్ద అల్పపీడనం ఏర్పడిందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్‌ జైన్ తెలిపారు. ఉపరితల ఆవర్తనం 5.8 కిమీ ఎత్తు వరకు విస్తరించి ఉండగా, ఇది రాబోయే 24 గంటల్లో పశ్చిమ, వాయువ్య దిశగా కదలనున్నట్లు పేర్కొన్నారు. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా తీరం వెంట గంటకు 35–55 కిమీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందన్నారు. మత్స్యకారులు సోమవారం వరకు సముద్రంలోకి వెళ్లరాదని హెచ్చరించారు. ఈ మేరకు శనివారం ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అలర్ట్ ఇచ్చింది.

వర్షాల హెచ్చరికలు..

సోమవారం (17-11-2025) నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రకాశం, కడపలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు వచ్చే ఛాన్స్ ఉంది. మంగళవారం (18-11-2025) నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రకాశం, సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. నవంబర్‌ 21 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, నవంబర్‌ 24–27 మధ్య కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Next Story