డిసెంబరు 17 నుంచి ధనుర్మాస తిరుప్పావై ప్రవచనాలు

by Disha Web Desk 21 |
డిసెంబరు 17 నుంచి ధనుర్మాస తిరుప్పావై ప్రవచనాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో : పవిత్ర ధనుర్మాసాన్ని పురస్కరించుకుని డిసెంబరు 17 నుంచి 2024 జనవరి 14 వరకు తిరుపతితోపాటు దేశవ్యాప్తంగా 216 కేంద్రాల్లో ప్రముఖ పండితులు తిరుప్పావై ప్రవచనాలు చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. టీటీడీ ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి అని స్పష్టం చేసింది. ఈ మేరకు టీటీడీ ఓ ప్రకటన విడుదల చేసింది.‘తిరుమల శ్రీవారి ఆలయంలోనూ ధనుర్మాసంలో సుప్రభాతం బదులు తిరుప్పావై నివేదించడం విశేషం. తిరుపతిలో అన్నమాచార్య కళామందిరంతోపాటు ఏడు ప్రాంతాల్లో తిరుప్పావై ప్రవచనాలు పారాయణం చేస్తారు. 12 మంది ఆళ్వారులలో ఒకరైన శ్రీ గోదాదేవి ధనుర్మాసం వ్రతం చేశారు. ఈ వ్రతం చేయడం వల్ల దేశం సమృద్ధిగా, సుభిక్షంగా ఉంటుంది’ అని తెలిపింది.‘ద్వాపరయుగంలో గోపికలు ఈ వ్రతాన్ని ఆచరించి శ్రీకృష్ణుని కృపకు పాత్రులయ్యారని భాగవతం దశమ స్కందంలో పేర్కొనబడింది. ఈ వ్రతం ఎలా పాటించాలనే విషయాన్ని శ్రీ గోదాదేవి 30 పాశురాలతో కూడిన తిరుప్పావై దివ్యప్రబంధాన్ని లోకానికి అందించారు. ఈ తిరుప్పావై సారాంశం భగవంతునికి కైంకర్యం చేయడమే. ఈ వ్రతం ఒకరు చేయడం కాకుండా అందరినీ కలుపుకుని చేస్తే గొప్ప ఫలితం ఉంటుందని పండితులు చెబుతారు. ఈ సంప్రదాయం ప్రకారం దేశవ్యాప్తంగా గల అన్ని వైష్ణవ దేవాలయాలలో తిరుప్పావై శాత్తుమొర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది’ అని తిరుమల తిరుపతి దేవస్థానం ఓ ప్రకటనలో వెల్లడించింది.

Next Story

Most Viewed