సనాతన ధర్మ పరిరక్షణపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర ట్వీట్

by Ramesh Naini |

సనాతన ధర్మ పరిరక్షణపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శుక్రవారం సోషల్ మీడియా వేదికగా (ఎక్స్) కీలక వ్యాఖ్యలు చేశారు.

సనాతన ధర్మ పరిరక్షణపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: సనాతన ధర్మ పరిరక్షణపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శుక్రవారం సోషల్ మీడియా వేదికగా (ఎక్స్) కీలక వ్యాఖ్యలు చేశారు. హిందువులు కేవలం భక్తులుగా మాత్రమే మిగిలి పోకూడదని, ధర్మాన్ని కాపాడే బాధ్యతాయుతమైన సంరక్షకులుగా మారాలని ఆయన పిలుపునిచ్చారు. హిందూ ధర్మంపై, దేవుళ్లపై దాడులు జరిగినప్పుడు సగటు హిందువు ప్రదర్శించే వైఖరిపై పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన 'ఎక్స్'లో #NoGheeInTTDLaddu , #SanatanaDharmaRakshaBoard అంటూ హ్యాష్‌ట్యాగ్‌తో తన సందేశాన్ని పోస్ట్ చేశారు.

ఐకమత్యం అవసరం...

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ట్వీట్ చేస్తూ.. ‘ప్రతి భక్తుడికీ ఒక ధార్మిక బాధ్యత ఉంటుంది. సగటు హిందువు దేవుడి పట్ల భయం, భక్తి కలిగి ఉంటాడు. కానీ, ఎవరైనా హిందూ దేవుళ్లను అవమానించినా, ధర్మాన్ని హేళన చేసినా.. వ్యక్తిగతంగా బాధపడి, ఆ విషయాన్ని 'కర్మ'కు వదిలేసి మౌనంగా ఉండిపోతాడు. ఈ సౌకర్యవంతమైన నిద్ర నుంచి, నిర్లక్ష్య వైఖరి నుంచి హిందువులు బయటకు రావాలి’ అని పేర్కొన్నారు. మనం కులం, ప్రాంతం, భాష పరంగా వేర్వేరుగా ఉండవచ్చు.. కానీ మన ధర్మం ఒక్కటే.. మన దేవుళ్ళు ఒక్కటేనని వెల్లడించారు.

ఇతరులకు వ్యతిరేకం కాదు..

మన ధర్మాన్ని, విశ్వాసాన్ని ఎవరైనా ఉద్దేశపూర్వకంగా, దురుద్దేశంతో కించపరిచినప్పుడు మన ఆవేదనను గట్టిగా వినిపించాలని అన్నారు. అటువంటి సమయాల్లో మౌనంగా ఉండటం సామూహిక మనస్సాక్షిని బలహీనపరుస్తుందని తెలిపారు. హిందూ ధర్మాన్ని రక్షించుకోవడం అంటే ఇతర మతాలకు వ్యతిరేకం అని అర్థం కాదు.. దాని అర్థం.. మన ధర్మాన్ని మనం కాపాడుకోవడమేనని తెలిపారు. కేవలం భక్తులుగా ఉండటమే కాకుండా, మన విశ్వాసానికి స్పృహ కలిగిన సంరక్షకులుగా (Conscious Guardians) వ్యవహరించాలని పవన్ కల్యాణ్ ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. కాగా, తిరుమల లడ్డు వివాదం నేపథ్యంలో ఈ ట్వీట్ నెటిజన్‌లతో పంచుకున్నారు.

Next Story