- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పిఠాపురం పట్టణంలో డిప్యూటీ సీఎం క్షేత్రస్థాయి పర్యటన..కాలినడకన వెళ్లి ప్రజా సమస్యలపై ఆరా
తన నియోజకవర్గం ప్రజలని కలుసుకునేందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పిఠాపురం పట్టణంలో క్షేత్రస్థాయి పర్యటన చేపట్టారు.

దిశ, డైనమిక్ బ్యూరో : తన నియోజకవర్గం ప్రజలని కలుసుకునేందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పిఠాపురం పట్టణంలో క్షేత్రస్థాయి పర్యటన చేపట్టారు. శుక్రవారం పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాలను ప్రారంభించిన అనంతరం ఆయన పట్టణంలో పాదయాత్రగా ప్రజల వద్దకు వెళ్లి, వారితో ముచ్చటిస్తూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పలువురి నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. పిఠాపురం ప్రజల నుంచి వచ్చిన అర్జీల పరిష్కారానికి తక్షణం చర్యలు తీసుకోవాలని అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
విద్యుత్ తీగలు ప్రమాదకరంగా ఉన్నాయి
ఆర్.ఆర్.బీ.హెచ్.ఆర్. కళాశాల మైదానం నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వెలుపలికి రాగానే పలువురు ప్రజలు అర్జీలు ఇచ్చేందుకు నిల్చుని ఉన్నారు. వారి సమస్యలు తెలుసుకునేందుకు వాహన శ్రేణి నుంచి దిగిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారు అక్కడి నుంచి శ్రీ కుక్కుటేశ్వరస్వామి వారి ఆలయం వరకు ప్రజల్ని పలుకరిస్తూ కాలినడకన ముందుకు సాగారు. పెద్దింటి అనంత పద్మావతి అనే మహిళ తమకు ఇంటి స్థలం కావాలని కోరారు. మరో మహిళ తమ ఇళ్ల వద్ద విద్యుత్ తీగలు సాగిపోయి కిందికి వచ్చేసి ప్రమాదకరంగా ఉన్నాయని, సాగిపోయిన విద్యుత్ తీగలు తగిలి అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయన్న విషయాన్ని పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు. సమస్యను తక్షణం పరిష్కరించాలని ఉప ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
పిఠాపురం పోలీస్ స్టేషన్ పరిశీలన
అనంతరం పిఠాపురం పట్టణ పోలీస్ స్టేషన్ ను ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పరిశీలించారు. స్టేషన్ లో ఉన్న గదులను చూసి పిఠాపురంలో శాంతి భద్రతల తీరుపై ఆరా తీశారు. స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో ఫోటోలు దిగారు. స్టేషన్ నుంచి బయటకు వచ్చి కుక్కుటేశ్వరస్వామి ఆలయ సమీపంలో యానాదుల కాలనీవాసులను పలుకరించారు. శ్రీ దుర్గా ప్రసాద్ అనే వ్యక్తి యానాదుల కాలనీలో పక్కా ఇళ్లు నిర్మించాలని, డ్రైనేజీ సమస్యతో ఇబ్బంది పడుతున్నామని పవన్ కల్యాణ్ కు చెప్పుకున్నారు. శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయం వెలుపల ఉన్న దుకాణదారులను పలకరించి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. చివరిగా ఆలయ అర్చకులతో మాట్లాడి వారితో ఫొటోలు దిగారు.
పిఠాపురంలో అభివృద్ధి పండుగ..
పిఠాపురం నియోజకవర్గానికి సంక్రాంతి తో పాటు అభివృద్ధి పండుగను తీసుకువచ్చారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్. పీఠికాపుర సంక్రాంతి మహోత్సవంలో పాల్గొన్న ఆయన రూ. 211 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. పిఠాపురం మండల పరిధిలో రూ.9.60 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ , కోనపాపపేటలో నిర్మించనున్న మల్టీపర్పస్ ఫిషరీస్ సెంటర్, ఉపాధి హామీ పథకం, ఆర్ అండ్ బీ నిధులు, సాస్కీ నిధులతో నిర్మించనున్న రోడ్లు, గోకులాలు, వివిధ అభివృద్ధి పనులు ఉన్నాయి.






