ఆ పాఠశాలలో ‘స్మార్ట్ కిచెన్’ .. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రశంసలు

by Jakkula.Mamatha |

ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా దూసుకెళ్తుంది

ఆ పాఠశాలలో ‘స్మార్ట్ కిచెన్’ .. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రశంసలు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా దూసుకెళ్తుంది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. ఇక, ఎన్డీయే కూటమి హయాంలో విద్యావ్యవస్థలో పెను మార్పులు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. విద్యార్థులకు యూనిఫాం, బ్యాగ్‌లు, సిలబస్, వివిధ పథకాలను సమూలంగా మార్పులు చేశారు. ఇటీవల తల్లికి వందనం పథకం అమలు చేశారు. అంతేకాదు, సమస్యలు చెప్పుకోవడానికి మెగా పేరెంట్ - టీచర్ సమావేశాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంకల్పంతో ఓ పాఠశాల రూపురేఖలే మారిపోయాయి. డొక్కా సీతమ్మ పేరిట బడి పిల్లలకు అందిస్తున్న భోజనం పరిశుభ్ర, ఆరోగ్యకర వాతావరణంలో వండించాలనే ఉద్దేశంతో కడపలోని మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్‌లో ‘స్మార్ట్ కిచెన్’ను నిర్మించారు. గత ఏడాది ఆ పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్స్ సమావేశానికి వెళ్ళినప్పుడు జిల్లా కలెక్టర్ స్మార్ట్ కిచెన్ ఆలోచన చెప్పారని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇందుకు అవసరమైన ఆర్థిక సహకారాన్ని పవన్ కళ్యాణ్ వ్యక్తిగత నిధుల నుంచి అందించారు. ఇప్పుడు కడప మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్‌లో ‘స్మార్ట్ కిచెన్’ సిద్ధమైంది.

ఇక్కడి నుంచే 12 పాఠశాలలకు ఆహారం సిద్ధమవుతుంది. న్యూట్రిషియన్ల సలహాలు పాటిస్తూ పోషక విలువలతో, రుచికరమైన ఆహారాన్ని వండి వార్చే కుక్స్, సహాయకులు ఇక్కడ ఉన్నారు. ఈ కిచెన్ కచ్చితంగా అందరికీ ఆదర్శంగా నిలుస్తుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ తరుణంలో విద్యారంగంలో సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీసుకొస్తున్న మార్పులు కచ్చితంగా చక్కటి ఫలితాలనిస్తున్నాయని తెలిపారు. ఈ రోజు నిర్వహిస్తున్న మెగా పేరెంట్ టీచర్స్ సమావేశాలు ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగవుతున్న ప్రమాణాలను తెలియచేస్తున్నాయి. కడపలో ‘స్మార్ట్ కిచెన్’ నిర్మాణాన్ని పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్స్(X) వేదికగా అభినందనలు తెలిపారు.

Next Story