విశాఖ ఉక్కుకు కరెంట్ షాక్

by Disha Web Desk 12 |
విశాఖ ఉక్కుకు కరెంట్ షాక్
X

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: రాష్ట్రానికి మిగులు విద్యుత్తును దశాబ్దాలపాటు అందించిన విశాఖ ఉక్కు కర్మాగారానికి కరెంట్ షాక్ తగిలింది. అసలే ప్రైవేటీకరణ కష్టాలతో అంతంత మాత్రంగా ఉన్న విశాఖ ఉక్కుపై విద్యుత్ పిడుగు పడింది. ప్లాంట్ నడపడానికి అవసరమైన విద్యుత్ ను ఉత్పత్తి చేయలేక, కొనడానికి అవసరమైన నిధులు లేక అవస్థలు పడుతోంది. స్టీల్ ప్లాంట్ కి సొంత కాప్టివ్ విద్యుత్ ప్లాంట్ ఉంది. 60 మెగావాట్లతో పని చేసే మూడు టర్బో జనరేటర్ల నుంచి 180 మెగావాట్లు, 67.5 మెగావాట్ల సామర్థ్యం గల మరో రెండు టర్బో జనరేటర్ల నుంచి 135 మెగావాట్లు కలిపి 315 మెగావాట్లను ప్లాంట్ ఉత్పత్తి చేస్తుంది. ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో పని చేయడానికి 418 మెగావాట్ల విద్యుత్ అవసరం. అయితే, ఆ ప్లాంట్ నడపడానికి తగినంత బొగ్గు సరఫరా కానందువల్ల పరిస్థితి దిన దిన గండంగా ఉంది. విశాఖ ఉక్కు పూర్తి సామర్థ్యంతో నడవాలంటే నిరంతర విద్యుత్ సరఫరా అవసరం. అందుకే ప్రారంభంలోనే సొంత విద్యుత్ ప్లాంట్ ను నిర్మించారు.

మూడో వంతే ఉత్పత్తి..

దీనికి కావలసిన ధర్మల్ బొగ్గును ఒరిస్సాలోని కోల్ ఇండియా సబ్సిడరీ మహానది కోల్ ఫీల్డ్స్ ఒప్పందం కూడా కుదుర్చుకుంది. దీని నుంచి ఏటా సుమారు 17 లక్షల టన్నుల థర్మల్ కోల్ ను విశాఖ ఉక్కుకు సరఫరా చేయాల్సి ఉంది. అయితే ఉక్కు ప్రైవేటీకరణ ప్రకటించేంత వరకు ఈ సరఫరా నిరంతరాయంగానే జరిగింది. తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బొగ్గు సరఫరాను దాదాపు పూర్తిగా తగ్గించేసింది. దీంతో వంద మెగావాట్లను మించి విద్యుత్ సరఫరా జరగడం లేదు. మిగిలిన విద్యుత్ను రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొనుగోలు చేస్తుంది.

బకాయిలు తీర్చకపోతే..

మొదట్లో నెలకు 20 కోట్ల రూపాయలు ఉండే విద్యుత్ బిల్లు ఇప్పుడు ఏకంగా 90 కోట్ల వరకు పెరిగిపోయింది. దీంతో ఒక్కసారిగా విద్యుత్ బిల్లులను చెల్లించలేని దుస్థితిలో విశాఖ ఉక్కు పడిపోయింది. బిల్లు చెల్లించకపోతే విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ (ఈపీడీసీఎల్ ) నోటీసులు జారీ చేసింది. దీంతో కంగారు పడిన ఉక్కు యాజమాన్యం అధికారుల జీతాలను ఆపి రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోని విద్యుత్ సంస్థకు బకాయిలు చెల్లించింది.

నోరుమెదపని ఎంపీలు..

ఒప్పందం ప్రకారం విశాఖ ఉక్కుకు మహానది కోల్ షీల్డ్స్ నుంచి థర్మల్ బొగ్గు సరఫరా చేయాల్సి ఉన్నా చేయడం లేదు. దీనిపై ఒక్క ప్రజా ప్రతినిధి కూడా అటు పార్లమెంట్‌లో ప్రశ్నించలేదు. ఇటు రాష్ట్ర ప్రభుత్వంలోనూ చర్చించలేదు. ఈ సమస్యను ఉక్కు కార్మికులు పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ దృష్టికి తెచ్చినా సీరియస్ గా తీసుకోలేదు. మహానది నుంచి వచ్చే థర్మల్ బొగ్గు టన్ను కేవలం 3200 రూపాయలకే దొరుకుతుంది. అదే ఇతర ప్రైవేటు సంస్థల నుంచి కొనుగోలు చేయాలంటే టన్ను 6,500 నుంచి 12 వేల రూపాయల వరకు ఉంది. ఇంత భారాన్ని మోసే స్థితిలో విశాఖ ఉక్కు లేదు. అందువల్ల మహానది బొగ్గు మీదనే పూర్తిగా ఆధారపడి పోయింది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యమిదే..

విశాఖ ఉక్కును చంపేయడం కోసం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు తమ తమ పాత్రను పోషిస్తున్నాయి. విశాఖ ఉక్కును ఈ కష్టకాలంలో ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా చొరవ చూపడం లేదు. విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామని హెచ్చరిక నోటీసులు జారీ చేయడన్ని ఉక్కు కార్మికులు జీర్ణించుకోలేకపోతున్నారు. కష్టాల్లో ఉన్న ప్రతిష్టాత్మక ఉక్కును పరిరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం చొరవ చూపడం లేదని ఉద్యోగులు మండి పడుతున్నారు. ఈ పరిస్థితి నుంచి ఉక్కును కాపాడాలంటే ప్రజా ఉద్యమం తప్ప వేరే గత్యంతరం లేదని కార్మికులు, కార్మిక సంఘాలు భావిస్తున్నాయి.

Read More..

ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై కఠిన చర్యలు


Next Story