సంస్కృతిని కాపాడుకోవాలి : మంత్రి అచ్చెన్నాయుడు

by Thanuru Gopichand |

అచ్చమైన పల్లె పండుగ సంక్రాంతి.

సంస్కృతిని కాపాడుకోవాలి : మంత్రి అచ్చెన్నాయుడు
X

దిశ, వెబ్ డెస్క్ : సంస్కృతి సంప్రదాయాలను ప్రతిఒక్కరం బాధ్యతగా కాపాడుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు (Kinajarapu Atchhanaidu) అన్నారు. కోటబొమ్మాళిలో (Kotabommali) బుధవారం జరిగిన సంక్రాంతి వేడుకలకు (Sankranti Celebrations) మంత్రి హాజరయ్యారు. భోగి మంటలను వేసి ప్రజలతో సరదాగా గడిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సంస్కృతి, సాంప్రదాయాలే ఒక జాతి మనుగడకు కీలకమైనవని పేర్కొన్నారు. వాటి నుంచి దూరమైనప్పుడు పతనానికి చేరువైతామన్నారు. తెలుగువారికి సంక్రాంతి పండుగ ఎంతో ముఖ్యమైనదని పేర్కొన్నారు. పాడి పంటల పండుగగా దీన్ని జరుపుకుంటామన్నారు. పాడి పశువులను ఇంట్లో కుటుంబ సభ్యులుగా చూసుకునే సంస్కృతిలో భాగస్వాములవ్వడం మనందరికీ గర్వకారణమన్నారు. కోటబొమ్మాళిలో జరిగిన సంబరాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ముగ్గుల పోటీలు, ఆటల పోటీలు, చిన్నారుల నృత్యాలు ఎంతో ఆకట్టుకున్నాయని తెలిపారు. సంక్రాంతి పండుగ శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి సరికొత్త బాటలు వేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నామని తెలిపారు.

భోగి మంటల వెలుగులు ప్రతి రైతు ఇంట్లో ఆనందాన్ని నింపాలని కోరుకున్నారు. కష్టాన్నే నమ్ముకున్న రైతుల శ్రమకు తగిన ప్రతిఫలం దక్కాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అన్నారు. వ్యవసాయ రంగం అభివృద్ధికి, రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. పాత కష్టాలు తొలగి, కొత్త ఆశలతో సంక్రాంతి సంబరాలు జరుపుకోవాలని కోరుకుంటూ ప్రజలందరికీ శుభాకాంక్షలను తెలియజేశారు.

Next Story