టీటీడీ ఆధ్వర్యంలో గోసంరక్షణ ఉద్యమం.... అదనపు ఈవో కీలక పిలుపు

by Vemula.Srinu Prasad |

గోమాత సంరక్షణ భారతీయ సంస్కృతిలో అత్యంత పవిత్రమైన సేవ అని, గోసంరక్షణ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని టిటిడి అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి కోరారు.

టీటీడీ ఆధ్వర్యంలో గోసంరక్షణ ఉద్యమం.... అదనపు ఈవో కీలక పిలుపు
X

దిశ, వెబ్ డెస్క్: గోమాత సంరక్షణ భారతీయ సంస్కృతిలో అత్యంత పవిత్రమైన సేవ అని, గోసంరక్షణ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని టిటిడి అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి(TTD Additional EO Sri CH Venkaiah Chowdhury) కోరారు. టిటిడి బోర్డు సభ్యుడు జ్యోతుల నెహ్రూ(TTD board member Jyotula Nehru), శ్రీనివాస సేవా ట్రస్ట్ ఛైర్మన్ టి. సత్యనారాయణ(Srinivasa Seva Trust Chairman T. Satyanarayana) ఆధ్వర్యంలో తిరుపతి ఎస్వీ గోశాలకు ఆదివారం 180 లారీల ద్వారా సుమారు 1600 టన్నుల ఎండుగడ్డిని విరాళంగా అందజేశారు.

సమాజానికి ఆదర్శం

ఈ సందర్భంగా వెంకయ్య చౌదరి మాట్లాడుతూ, కాకినాడ జిల్లా జగ్గంపేట ప్రాంతం నుండి ఎండుగడ్డిని సేకరించి, సొంత నిధులతో పాటు రవాణా ఖర్చులను భరిస్తూ ఇంత భారీ స్థాయిలో మొదటిసారిగా విరాళం అందించడం అభినందనీయమన్నారు. గోవుల పరిరక్షణ, పాడి ఉత్పత్తుల పెంపు కోసం సేవా కార్యక్రమాలు చేపట్టడం సమాజానికి ఆదర్శమన్నారు. పురాణాలలో గోవుకు విశిష్ట స్థానం ఉందని, గోసేవ సనాతన ధర్మమని పేర్కొన్నారు. తిరుపతి ఎస్వీ గోశాలకు అందిన ఎండుగడ్డిని టిటిడి పరిధిలోని తిరుపతి, తిరుమల, పలమనేరు, బాకారాపేట సమీపంలోని కమలయ్యగారిపల్లి గోశాలలకు సరఫరా చేస్తామని తెలిపారు. ప్రస్తుతం ఈ గోశాలల్లో మొత్తం 2974 గోవులు, ఎద్దులు, లేగదూడలు ఉన్నాయని వెల్లడించారు.

జగ్గంపేట రైతులు గ్రేట్


టిటిడి బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ గత ఏడాది 38 లారీల ఎండుగడ్డిని అందించగా, ఈసారి 180 లారీల ఎండుగడ్డిని విరాళంగా సమర్పించడం ఆనందంగా ఉందన్నారు. జగ్గంపేట రైతులు ఉచితంగా ఎండుగడ్డిని అందించడం గొప్ప విషయమని రైతులను ప్రత్యేకంగా అభినందించారు. నెహ్రూ ఫౌండేషన్, శ్రీనివాస సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో రవాణా తదితర ఖర్చులను భరిస్తూ ఎస్వీ గోశాలకు ఈ సేవ అందించామని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్వీ గోశాలకు రెండు గోవులు, దూడను జ్యోతుల నెహ్రూ విరాళంగా అందించారు.

Next Story