చిరుత దాడిలో ఆవు దూడ మృతి

by Vemula.Srinu Prasad |

కంబదూరు మండలంలోని కస్తూరిబా పాఠశాల వెనుక ఉన్న ఏకలకొండ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం చిరుత దాడిలో ఆవు దూడ మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది....

చిరుత దాడిలో ఆవు దూడ మృతి
X

దిశ, కళ్యాణదుర్గం: కంబదూరు మండలంలోని కస్తూరిబా పాఠశాల వెనుక ఉన్న ఏకలకొండ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం చిరుత దాడిలో ఆవు దూడ మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. బ్రహ్మయ్య ఆలయం నిర్వాహకుడు, రైతు హనుమంతప్ప, ఆనంద్ తమ ఆలయం వద్ద ఆవులను మేపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆదివారం సాయంత్రం మేత కోసం కొండ ప్రాంతానికి వెళ్లిన ఆవు దూడపై చిరుత దాడి చేసి మెడ భాగాన్ని కొరికి చంపినట్లు వారు తెలిపారు. ఆవు దూడపై చిరుత దాడి చేస్తున్న సమయంలో తాను ప్రత్యక్షంగా చూశానని రైతు హనుమంతప్ప మీడియాకు తెలిపారు. ఈ ఘటనలో సుమారు రూ.30 వేల మేర ఆర్థిక నష్టం వాటిల్లిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

దాడి చేసిన చిరుత చాలా పెద్దదిగా ఉండి, దాని తోక కూడా పొడవుగా, దట్టంగా ఉందని స్థానికులు తెలిపారు. చిరుత సంచారంతో పరిసర గ్రామాల రైతులు, పశుపోషకులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని చెప్పారు. చిరుతను గుర్తించి బోన్లు ఏర్పాటు చేసి బంధించి, అటవీ ప్రాంతంలోకి తరలించేలా అటవీ శాఖ అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు. రైతులు పశువులను మేపేందుకు వెళ్లే సమయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Next Story