మరో వివాదంలో ‘ఆదిపురుష్’ సినిమా.. రిలీజ్‌ను అడ్డుకుంటామని దళితుల హెచ్చరిక

by Disha Web Desk 16 |
మరో వివాదంలో ‘ఆదిపురుష్’ సినిమా.. రిలీజ్‌ను అడ్డుకుంటామని దళితుల హెచ్చరిక
X

దిశ, డైనమిక్ బ్యూరో: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కృతి సనన్ హీరోయిన్‌గా తెరకెక్కిన చిత్రం ఆదిపురుష్. ఈ చిత్రం ప్రి రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో కన్నులపండువగా జరిగిన సంగతి తెలిసిందే. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో భాగంగా తిరుమల శ్రీవారిని చిత్ర యూనిట్ దర్శించుకుంది. దర్శనం అనంతరం ఆలయ ప్రాంగణంలో హీరోయిన్‌ కృతి సనన్‌ను దర్శకుడు ఓం రౌత్ కౌగిలించుకుని ముద్దు పెట్టాడు. అనంతరం ఫ్లైయింగ్ కిస్ కూడా ఇచ్చాడు. దేవాలయంలో చిత్ర యూనిట్ అపచారం చేసిందని బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది మరువకముందే మరో వివాదాస్పద అంశం తెరపైకి వచ్చింది. ఆదిపురుష్ సినిమాను ఈ నెల 16న విడుదల చేస్తున్నట్లు ఓ ప్రకటన విడుదలైంది.

అయితే ఆ ప్రకటనలో దళితులకు ప్రవేశం లేదని ప్రచురించింది. ఇది కాస్తా వైరల్‌గా మారింది. దీంతో దళితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా విడుదలను అడ్డుకుంటామని దళిత హక్కుల పరిరక్షణ సమితి ప్రకటించింది. చిత్ర యూనిట్ ఈ ప్రకటన చేయడం 75 సంవత్సారాల స్వతంత్ర భారత దేశంలో దళితులకు భారత రాజ్యాంగంలో పొందుపరచిన హక్కులను భంగం కలిగించడమే అవుతుందని దళిత హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎంఆర్ హనుమంతు అభిప్రాయపడ్డారు. దళితుల అత్మ గౌరవం దెబ్బ తినే విధంగా విడుదల చేసిన ప్రకటనపై దర్యాప్తు చేసి విచారించి వెంటనే చిత్ర బృందంపై ఎస్సీ & ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ప్రకటనను నిరసిస్తూ గురువారం ఉదయం తెలుగు రాష్ట్రాల్లోని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయనున్నట్లు దళిత హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎం ఆర్ హనుమంతు వెల్లడించారు. ఇకపోతే సినిమాకు సంబంధించిన పోస్టర్‌పై చిత్ర యూనిట్‌ అలా ప్రకటించిందా..? లేక ఎవరిపనైనా అన్న కోణంలో చర్చ జరుగుతుంది.

Read more: ‘ఆదిపురుష్’ ట్రైలర్ జన్యూన్ రివ్వూ.. (వీడియో)



Next Story

Most Viewed