విజయవాడ సెంట్రల్‌ టికెట్‌పై సైకిల్ సవారీ: బొండా ఉమా వర్సెస్ వంగవీటి రాధా

by Disha Web Desk 21 |
విజయవాడ సెంట్రల్‌ టికెట్‌పై సైకిల్ సవారీ: బొండా ఉమా వర్సెస్ వంగవీటి రాధా
X

దిశ, డైనమిక్ బ్యూరో : మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ దూకుడు పెంచుతున్నారా? ఇక టీడీపీలోనే కొనసాగబోతున్నారా? ఇన్నాళ్లు స్తబ్ధుగా ఉన్న వంగవీటి రాధా ఒక్కసారిగా యాక్టివ్ కావడానికి గల కారణాలు ఏంటి.. టీడీపీ ఏమైనా బలమైన హామీ ఇచ్చి ఉంటుందా? ఇవే ప్రశ్నలు కృష్ణా జిల్లా రాజకీయాల్లో తిరుగుతున్నాయి. 2019 ఎన్నికల అనంతరం వంగవీటి రాధా దాదాపు రాజకీయాల్లో సైలెంట్ అయిపోయారు. తన తండ్రి వంగవీటి రంగా జయంతి, వర్థంతి వేడుకలకు మాత్రమే వచ్చి వెళ్ళిపోతున్నారు. అదే సమయంలో వంగవీటి రంగా విగ్రహాల ఆవిష్కరణలో పాల్గొంటూ తన సత్తా ఏమిటో రాజకీయ పార్టీలకు తెలియజేస్తున్నారు. అయితే 2019 ఎన్నికల అనంతరం వంగవీటి రాధా టీడీపీలో సైలెంట్ అవ్వడం ఒక ఎత్తైతే మరోవైపు జనసేన నేతలతో వరుస భేటీలు సైతం అయ్యారు. ఈ నేపథ్యంలో వంగవీటి రాధా జనసేనలోకి వెళ్లిపోతున్నారనే ప్రచారం కూడా జరిగింది. కానీ ఉన్నట్లు ఉండి వంగవీటి రాధా యాక్టివ్ పాలిటిక్స్‌లోకి వచ్చేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్రలో మెరుస్తున్నారు. యువగళం పాదయాత్రలో ఇప్పటికే రెండు సార్లు పాల్గొన్నారు వంగవీటి రాధా. అలాగే గన్నవరం నియోజకవర్గానికి చెందిన యార్లగడ్డ వెంకట్రావు టీడీపీలో చేరినప్పుడు కూడా లోకేశ్ వెంట ఉన్నారు. ఈ పరిణామాలన్నింటిని పరిశీలిస్తే వంగవీటి రాధా టీడీపీలోనే కొనసాగే అవకాశాలు ఉన్నాయి అనిపిస్తోంది. మరోవైపు వంగవీటి రాధా ఎన్నికల సమయానికి టీడీపీలో చేరినా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదని చర్చ కూడా జరుగుతుంది. ఇంతకీ వంగవీటి రాధా మదిలో ఏముందో ఎవరికీ అంతుచిక్కడం లేదు.

లోకేశ్‌తో ఏకాంతంగా భేటీ

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వంగవీటి రాధాకృష్ణ రాజకీయాల్లో దూకుడు పెంచారు. నాలుగేళ్లుగా రాజకీయాల్లో తనకంటూ హద్దులు పెట్టుకున్నారు వంగవీటి రాధా. ఆ పరిమితి మేరకే రాజకీయం చేశారు. టీడీపీ క్రియాశీలక సమావేశాలకు సైతం గైర్హాజరయ్యారు. కేవలం తన తండ్రి, దివంగత ఎమ్మెల్యే వంగవీటి రంగా విగ్రహ ఆవిష్కరణ బహిరంగ సభలు, వంగవీటి రంగా జయంతి వర్థంతి కార్యక్రమాల్లో మాత్రమే పాల్గొనేవారు. ఆ సభలలో వంగవీటి రాధా స్పీచ్‌కు జనాలు విజిల్స్ మోత మోగించేవారు. దీంతో వంగవీటి రాధా బలగం రాజకీయ పార్టీలు గుర్తించాయి. అందులోనూ వంగవీటి రాధా టీడీపీలో ఇన్ ఆక్టివ్‌గా ఉండటంతో అటు జనసేన తమ పార్టీలోకి ఆహ్వానించినట్లు వార్తలు సైతం వినిపించాయి. అంతేకాదు వంగవీటి రాధా పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్‌తో సైతం భేటీ అయ్యారు. దీంతో ఇక వంగవీటి రాధా జనసేనలో చేరిపోతారనే ప్రచారం జరిగింది. కానీ అందుకు బ్రేక్‌లు పడ్డాయి. ఇటీవల కాలంలో రాధా యాక్టివ్ పాలిటిక్స్‌లోకి వచ్చేశారు. నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రలో మెరుస్తూ వస్తున్నారు. లోకేశ్‌తో కలిసి పాదయాత్రలో పాల్గొంటున్నారు. అలాగే టీడీపీకి సంబంధించిన పలు కార్యక్రమాల్లో సైతం వంగవీటి రాధా పాల్గొంటున్నారు. అయితే వచ్చే ఎన్నికల వరకు టీడీపీలోనే వంగవీటి రాధా కొనసాగుతారా అన్నదానిపై మాత్రం ఉత్కంఠ నెలకొంది.

ఉమా వర్సెస్ రాధా

వంగవీటి రాధా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. వైసీపీలో విజయవాడ సెంట్రల్ టికెట్ ఇవ్వనుందకే ఆ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు. అయితే గత ఎన్నికల్లో పోటీ చేయకుండా కేవలం స్టార్ కాంపైనర్‌గా పార్టీకోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గత ఎన్నికల్లో బొండా ఉమా మహేశ్వరరావు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే ఈసారి తనకు టికెట్ వస్తుందనే ఆశలు పెట్టుకున్నారు వంగవీటి రాధా. టీడీపీ-జనసేనల మధ్య పొత్తు కుదిరే అవకాశం ఉన్న నేపథ్యంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టికెట్‌పై వంగవీటి రాధా ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు బొండా ఉమా సైతం పోటీకి ఆసక్తిగా ఉన్నారు. దీంతో టీడీపీలో టికెట్ విషయంలో అటు రాధా, ఇటు ఉమల మధ్య పోటీ నెలకొంది. దీంతో సీటు ఎవరికి దక్కుతుందోనన్న ఆందోళన నెలకొంది. అయితే తాజాగా గురువారం లోకేశ్‌తో వంగవీటి రాధా ప్రత్యేకంగా భేటీ అయ్యారు.పాదయాత్ర విరామ సమయంలో వంగవీటి రాధా నారా లోకేశ్‌తో దాదాపు 20 నిమిషాలపాటు ఇరువురు ఏకాంతంగా భేటీ అయ్యారు. ఇద్దరే చర్చించుకున్నారని మూడో వ్యక్తి వీరి భేటీలో లేకపోవడం చర్చ జరుగుతుంది. అయితే వచ్చే ఎన్నికల్లో వంగవీటి రాధా ఏ పార్టీలో వెళ్లకుండా ఉండేందుకు లోకేశ్ కీలకమైన హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీ తరఫున స్టార్ కాంపైనర్‌గా వంగవీటి రాధా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టికెట్‌పై చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టికెట్ హామీపై ఖచ్చితమైన హామీ ఇవ్వలేదని తెలుస్తోంది. టికెట్ కేటాయింపు విషయంలో ఫైనల్ నిర్ణయం చంద్రబాబుదేనని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఏది ఏమైనప్పటికీ వచ్చే ఎన్నికల్లో చట్ట సభలలో మాత్రం వంగవీటి రాధా అడుగుపెడతారని బలమైన హామీ లోకేశ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అంటే బొండా ఉమా మహేశ్వరరావుకు టికెట్ ఇస్తే వంగవీటి రాధాను ఎమ్మెల్సీ చేస్తారనే ప్రచారం జరుగుతుంది.

జనసేన నుంచి ఆహ్వానం

తెలుగుదేశం పార్టీ నుంచి స్పష్టమైన హామీ రాకపోతే వంగవీటి రాధా జనసేనలో చేరుతారనే ప్రచారం కూడా ఉంది. వంగవీటి రాధా త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మున్సిపల్ మాజీ ఛైర్ పర్సన్ జక్కం అమ్మాణి, బాబ్జీ దంపతుల కుమార్తె పుష్పవల్లిని రాధా పెళ్లి చేసుకోబోతున్నారు. సెప్టెంబర్ 6న వీరి పెళ్లి జరగనున్నట్టు ఆయన సన్నిహితులు తెలిపారు. వంగవీటి రాధాకు కాబోయే అత్తమామలు జనసేనలో కీ రోల్ పోషిస్తున్నారు. ఇటీవలే వారాహి విజయయాత్ర విరామ సమయంలో పవన్ కల్యాణ్ జక్కం బాబ్జీ, అమ్మాణి నివాసంలో బస చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వంగవీటి రాధా జనసేనలో చేరితే ఖచ్చితంగా టికెట్ ఇప్పించే బాధ్యత మామ బాబ్జీ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే సెంట్రల్ నియోజకవర్గంలో 30 వేల వరకు కాపు, మరో 30 వేల తూర్పు కాపు సామాజిక వర్గ ఓట్లు ఉన్నాయి. 20 వేల వరకు బ్రాహ్మణ సామాజిక వర్గ ఓటర్లు ఉన్నారు. అలాగే 28 వేల యాదవ వర్గ ఓటర్లు సైతం ఉన్నారు.అయితే వచ్చే ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి బీసీ అభ్యర్థిని బరిలోకి దించాలనే యోచనలో వైసీపీ ఉంది. అయితే వంగవీటి రాధా మాత్రం ఈ నియోజకవర్గంలో కాపు ఓటర్లతోపాటు తన తండ్రి అభిమానులు ఉన్నారని తనకు టికెట్ ఇస్తే గెలుపు తథ్యం అని బలంగా నమ్ముతున్నారు. మరి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు టికెట్ ఎవరికి ఇస్తారనేది చర్చనీయాశంగా మారింది.

Read More : కన్‌ఫ్యూజ్ చేస్తున్న పవన్ కల్యాణ్.. కొత్తగా తెరపైకి మరో కార్యక్రమం..!

Next Story