రండి..సెటిల్‌మెంట్ చేస్తాం..

by Yella Dhawani Reddy |

ప్రముఖ వ్యాపారులు రూ.400 కోట్లకు ఐపీ పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారన్న ‘దిశ’ కథనాలు నరసరావుపేటలో సంచలనంగా మారాయి.

రండి..సెటిల్‌మెంట్ చేస్తాం..
X

- ఐపీ పెట్టబోతున్న వ్యాపారులకు రాయబారం

- సంచలనంగా మారిన ‘దిశ’ కథనాలు

దిశ, ప్రతినిధి నరసరావుపేట: ప్రముఖ వ్యాపారులు రూ.400 కోట్లకు ఐపీ పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారన్న ‘దిశ’ కథనాలు నరసరావుపేటలో సంచలనంగా మారాయి. అటు వ్యాపార వర్గాలలో ఇటు సామాన్యుల్లో పెద్ద ఎత్తు చర్చనీయాంశం అయ్యాయి. ప్రముఖులకు అప్పు ఇచ్చిన వారంతా తిరిగి చెల్లించాలంటూ ఒత్తిడి పెంచారు. చిట్ ఫండ్ యజమాని, రియల్టర్ అయిన ఓ వ్యాపారి ఇంటికి, ఆయన సంస్థ వద్దకు ఇక్కడి వారితో పాటు దూరప్రాంతాల వారు వచ్చి డబ్బుల గురించి రగడ సృష్టించి వెళ్తున్నారు. అలాగే, మిగిలిన వ్యాపారస్తులపైనా అప్పులిచ్చిన వారు డబ్బుల కోసం తిరుగుతున్నారు.

వారు.. రొటేషన్ చక్రవర్తులు..

ఇప్పటికే భారీగా అప్పులు చేసిన ప్రముఖులు కొందరు పట్టణం వదిలిపోగా, మరికొందరు మొహం చాటేసినట్టు తెలిసింది. ప్రముఖులుగా చెలామణి అవుతున్న వారు ఈ సంఘటనలతో రొటేషన్ చక్రవర్తులని అందరికీ అర్థమైపోయింది. వీరు కార్లలో జల్సాగా తిరుగుతుంటారు. అది చూసిన అమాయకులు వారు కోటీశ్వరులుగా భావించి అప్పులు ఇచ్చినట్టు తెలిసింది. ఇప్పుడు వీరంతా లబోదిబోమంటున్నారు. భారీగా అప్పులు తీసుకున్న ఓ వ్యాపార ప్రముఖుడు ఆస్తులన్నీ తన భార్య పేరున మార్చేసినట్టు తెలిసింది. ఇద్దరు గోల్డ్ వ్యాపారుల వ్యవహారం కూడా గందర గోళంగా ఉన్నట్టు సమాచారం.

పూర్తి వివరాలు సేకరించిన పోలీసులు..

ఈ వ్యవహారం ఇలా నడుస్తుండగానే, కొందరు సెటిల్‌మెంట్ చేస్తాం రావాలని రాయబారాలు పంపినట్టు తెలిసింది. పోలీసులను అడ్డం పెట్టుకొని సంపాదించుకోవాలని మరికొందరు తెగతాపత్రయ పడుతున్నట్టు సమాచారం. గత ఐదేళ్ల పాలనలో పోలీసులపై వ్యాపారం చేసి లక్షలు పోగేసుకున్న ప్రముఖులు ఎందరో ఇక్కడ ఉన్నారు. తిరిగి తమ పాత విద్యను ప్రదర్శించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఐపీ పెట్టబోతున్న వ్యాపారుల గురించి పోలీసులు సమగ్ర వివరాలు సేకరించినట్లు తెలిసింది. మొత్తం మీద వ్యాపారుల ఐపీ వ్యవహారం అన్ని వర్గాల వారిని ఆందోళనకు గురి చేస్తోంది.

Next Story